సీనియర్ హీరో నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. భర్త పేరు చెప్పి ఆమె చాలామంది వద్ద డబ్బులు వసూలు చేసినట్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే సీనియర్ హీరో నరేష్ కి రమ్య రఘుపతితో 8 ఏళ్ల క్రితం వివాహమైంది. అయితే కొన్ని రోజులు కలతలు లేకున్నా సాగిన వీరి కాపురంలో విభేదాలు రావడంతో వీరిద్దరు విడిగా ఉంటున్నారు.
విడిగా ఉంటున్న రమ్య రఘుపతి నరేష్కు ఉన్న ఆస్తులను చూపించి.. ఈ ఆస్తి అంతా తనకే చెందుతుందని చెబుతూ చాలా మంది నుంచి కోట్లు కోట్లు డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.హైదరాబాద్, అనంతపూర్, హిందూపూర్లో రమ్య భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. రమ్య రఘుపతి చేతిలో మోసపోయిన ఐదుగురు మహిళలు ఫిర్యాదు చేయడంతో ఆమె గుట్టు బయటపడింది. ఇక మాజీ భార్య వ్యవహారం తనకేం సంబంధం లేదని నరేష్ అనడం గమనార్హం. ఐదుగురు మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రమ్యను పూర్తి స్థాయిలో పోలీసులు విచారణ చేయనున్నారు.