చాలామంది ఒత్తిడి అంటే ఏదో హఠాత్తుగా వచ్చే ప్రమాదం అని భ్రమపడతారు. కానీ నిజానికి ఇది ఒకేసారి రాదు. రోజూ మనం ఎదుర్కొనే చిన్నపాటి చిరాకులు, నిద్రలేమి, ట్రాఫిక్ ఇబ్బందులు ఒకదానిపై ఒకటి పేరుకుపోయి భారీ ఒత్తిడిగా మారుతాయి. దీనినే వైద్యులు ‘స్టాక్డ్ స్ట్రెస్’ అంటారు. మన శరీరం ఇలాంటి ఇబ్బందులకు అలవాటు పడిపోవడం వల్ల, అసలు మనం ఒత్తిడిలో ఉన్నామనే విషయాన్ని గుర్తించలేకపోవడమే అసలైన ప్రమాదం.
నిద్ర లేకపోవడం..
మీ శరీరం కొన్ని నిశ్శబ్ద సంకేతాల ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తుంది. రాత్రంతా నిద్రపోయినా ఉదయం అలసటగా అనిపించడం, చిన్న విషయాలకే చిరాకు పడటం, తరచుగా తలనొప్పి రావడం, పనులపై ఏకాగ్రత కుదరకపోవడం వంటివి ప్రాథమిక లక్షణాలు. వీటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో బీపీ, గుండె జబ్బులు వంటి తీవ్ర సమస్యలు తప్పవు. ఒత్తిడి పెరిగినప్పుడు శరీరంలో విడుదలయ్యే ‘కార్టిసాల్’ హార్మోన్ స్థాయిలు తగ్గకపోతే, అది రోగనిరోధక శక్తిని మరియు మెదడు పనితీరును దెబ్బతీస్తుంది.
Also Read:Fake IAS Officer: నిత్య పెళ్లికొడుకు బాగోతం.. నకిలీ ఐఏఎస్గా 25 సార్లు పెళ్లిళ్లు.. ఎలా చిక్కాడంటే!
సోషల్ మీడియాకు దూరం..
ఒత్తిడిని పూర్తిగా ఆపలేకపోయినా, అది పేరుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. పని మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం, పడుకునే ముందు ఫోన్ పక్కన పెట్టడం, శరీరానికి సరిపడా నిద్ర అందించడం వంటి చిన్న మార్పులు గొప్ప ఫలితాలనిస్తాయి. బెంగళూరుకు చెందిన డాక్టర్ మురళీకృష్ణ చెప్పినట్లు.. ఒత్తిడి అనేది కురిసే జల్లు లాంటిది, అది వరదగా మారకముందే మేల్కొనాలి. మానసిక ప్రశాంతతే అసలైన ఆరోగ్యం.