ప్రపంచాన్ని వణికిస్తోంది కరోనా మహమ్మారి. ఇప్పటికే అనేక దేశాలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్నాయి. కరోనా పుణ్యమా పనిచేసే విధానంలో చాలా మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా సర్వీస్ సెక్టార్ లో చాలా వరకు ఉద్యోగులు ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇప్పటికీ చాలా సాఫ్ట్ వేర్ కంపెనీలు ఈ పద్ధతి ద్వారానే వారి ఉద్యోగులతో పని చేయించుకుంటున్నాయి. వర్క్ ఫ్రం హోం సంస్కృతికి అలవాటు పడిన వారు ఆఫీసులకు వెళ్లేందుకు సుముఖత చూపించడం లేదు.
Read Also: Internet: ఆ రాష్ట్రంలో సొంత ఇంటర్నెట్.. ఇండియాలో మొదటి రాష్ట్రంగా గుర్తింపు
ఇదిలా ఉంటే ఏకంగా నెదర్లాండ్స్ ప్రభుత్వం వర్క్ ఫ్రం హోం ను చట్టబద్ధం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో సంబంధిత బిల్లును నెదర్లాండ్స్ ప్రభుత్వం ఇటీవల ఆ దేశ చట్ట సభల్లోని దిగువసభలో ప్రవేశపెట్టింది. దీన్ని సభ ఆమోదించింది. ఎగువసభ కూడా ఆమోదిస్తే బిల్లు చట్టరూపం దాలుస్తుంది. ఈ చట్టం ద్వారా ఉద్యోగులు తమ యాజమాన్యాన్ని వర్క్ ఫ్రం హోం కోసం డిమాండ్ చేయవచ్చు. వర్క్ ఫ్రం హోంను చట్టబద్ధం చేసిన తొలిదేశంగా ప్రపంచంలో నెదర్లాండ్స్ నిలవనుంది. మరోవైపు మరికొన్ని దేశాలు కూడా వర్క్ ఫ్రం హోం చట్టబద్ధం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల స్కాట్కాండ్ ప్రభుత్వం, ప్రభుత్వ ఉద్యోగులు వారానికి 4 రోజులు వర్క్ ఫ్రం హోం చేసుకునే ప్రతిపాదనను తీసుకువచ్చింది. అయితే అందుకు బదులుగా జీతాల్లో కోత విధిస్తామని చెప్పింది. దీంతో ఈ అంశం అక్కడ వివాదాస్పదం అయింది.
అయితే కరోనా తగ్గముఖం పట్టడంతో చాలా దేశాల్లో ఉద్యోగులను కంపెనీలు ఆఫీసులకు రమ్మని చెబుతున్నాయి. ఆఫీసులకు వస్తేనే పని మరింగా మెరుగుపడుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. ఇటీవల టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తమ ఉద్యోగులను ఆఫీసులకు రావాలని ఆదేశించారు.. అలా చేయకపోతే రాజీనామా చేయాలని ఆదేశాలు జారీ చేశాడు.