US-Iran Talks: మధ్యప్రాచ్యంలో సంఘర్షణకు చెక్ పెట్టేలా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు మరికాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని చర్చల బృందం పాకిస్తాన్ చేరుకున్నాయి. ఇక ఇరాన్ చర్చల బృందానికి ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ నాయకత్వం వహిస్తుండగా, ఆయనతో పాటు ఆ దేశ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ కూడా ఉన్నారు.
Read Also: PM Modi: బీజేపీ గెలిస్తేనే ఆడ బిడ్డలు సురక్షితంగా ఉంటారు.. బెంగాల్లో మోడీ ప్రచారం
ఇదిలా ఉంటే, చర్చలకు ముందే ఇరాన్ అతిపెద్ద విజయం సాధించింది. చర్చలకు తాము హాజరుకావాలంటే ముందు 2 డిమాండ్లను ఒప్పుకోవాలని ఇరాన్ మెలిక పెట్టింది. దీంతో ఈ రెండు డిమాండ్లకు అమెరికా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా ఆంక్షల కారణంగా ఖతార్తో పాటు ఇతర విదేశీ బ్యాంకుల్లో చిక్కుకున్న ఇరాన్కు సంబంధించిన డబ్బు రిలీజ్ చేసేందుకు అమెరికా ఓకే చెప్పింది. ఇక లెబనాన్పై ఇజ్రాయిల్ దాడులు ఆపాలని, ఈ రెండు దేశాల మధ్య కూడా కాల్పుల విరమణ ఉండాలని ఇరాన్ పట్టుబట్టింది. ప్రస్తుతం ఈ రెండు డిమాండ్లకు యూఎస్ అంగీకరించినట్లు రాయిటర్స్ నివేదించింది. డబ్బుల విడుదలకు ప్రతిగా, హోర్ముజ్ జలసంధి గుండా నౌకల సురక్షిత ప్రయాణానికి హామీ ఇస్తామని ఇరాన్ తెలిపింది.
మరోవైపు, అమెరికా, ఇరాన్ బృందాలు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ను కలుస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్కు చెందిన ఉన్నతస్థాయి బృందం షరీఫ్తో సమావేశమైంది. మరికాసేపట్లో అమెరికా చర్చల బృందం కూడా పాక్ పీఎంను కలవబోతోంది.
