US Iran Tension: ఇరాన్పై అమెరికా దాడికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లే అన్ని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా ఆ దేశంలో భారీ ఎత్తున ప్రజలు ఉద్యమిస్తున్నారు. మరోవైపు, ఈ నిరసనల్ని అణిచివేసేందుకు ఇరాన్ మతపాలకులు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు, ఈ నిరసనల్లో దాదాపుగా 500 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే, ఉరిశిక్షల్ని ఉపయోగించి నిరసనల్ని క్రూరంగా అణగదొక్కాలని భావిస్తోంది.
Read Also: Death and Brain: మరణానికి ముందు ఏం జరుగుతుంది.? చివరి క్షణాల్లో మెదడు ఏం చేస్తుంది..
ఈ నేపథ్యంలో, ఇరాన్లో అమెరికా జోక్యం చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే ఇరాన్ చుట్టుపక్కల ఉన్న అమెరికన్ ఎయిర్ బేసుల్లో మోహరింపు పెరిగింది. మిడిల్ ఈస్ట్లో అమెరికాకు ఉన్న అతిపెద్ ఎయిర్ బేసుల్లో ఒకటైన ఖతార్లోని అల్ ఉడెయిడ్ బేస్ యాక్టివేట్ అయింది. ఈ ఎయిర్ బేస్లో యుద్ధ విమానాలను మోహరిస్తున్నట్లు తెలిసింది. ఈ వైమానిక స్థావరం ఇరాన్ సరిహద్దు నుంచి కేవలం 300 కి.మీ దూరంలో ఉంది.
ఇప్పటికే అమెరికా ఇరాన్లోని తన పౌరుల్ని ఆ దేశం విడిచి వెళ్లమని కోరింది. ఇజ్రాయిల్ మీడియా నివేదిక ప్రకారం, గాలిలో ఇంధనాన్ని నింపే విమానంతో పాటు, B-52 వ్యూహాత్మక బాంబర్తో సహా అనేక అమెరికా యుద్ధ విమానాలను మోహరించినట్లు తెలుస్తోంది. ఖతార్ రాజధాని దోహాకు నైరుతి దిశలో సుమారు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ వైమానిక స్థావరంలో 10,000 మందికి పైగా అమెరికా సైనికులు ఉన్నారు. ఇది ఈ ప్రాంతంలోని అతిపెద్ద అమెరికా సైనిక స్థావరాలలో ఒకటి, ఇక్కడ 4,500 మీటర్ల పొడవైన రన్వే ఉంది, ఇది B-52 వ్యూహాత్మక బాంబర్లు, రవాణా విమానాల వంటి పెద్ద సైనిక విమానాలకు అనువుగా ఉంటుంది.