Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి హార్ముజ్ జలసంధి, ఇరాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొంత సమయం ఇస్తే, వ్యూహాత్మకంగా కీలకమైన హార్ముజ్ జలసంధిని అమెరికా తిరిగి ఓపెన్ చేస్తుందని అన్నారు. ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్లో ఈ విషయాన్ని వెల్లడించారు. చమురు సరఫరాకు కీలకంగా ఉన్న ఈ మార్గాన్ని తన నియంత్రణలోకి తీసుకోగలదని ట్రంప్ అన్నారు.
‘‘మరికొంత సమయం ఇస్తే, మనం హోర్ముజ్ జలసంధిని సులభంగా తెరవగలం, చమురును స్వాధీనం చేసుకోగలం, మరియు భారీగా లాభపడగలం. ఇది ప్రపంచానికి చమురు ప్రవాహాన్ని ఉప్పెనలా తెస్తుంది’’ అని ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్లో పేర్కొన్నారు. ప్రపంచంలోని చమురు రవాణాలో 20 శాతం హార్ముజ్ జలసంధి గుండా సాగుతుంది. అమెరికా, ఇజ్రాయిల్ దాడుల తర్వాత ఇరాన్ హర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంది. ఈ జలమార్గం గుండా చమురు, గ్యాస్, సరకు రవాణా నౌకల్ని కంట్రోల్ చేస్తోంది.
Read Also: Rythu Bharosa: తెలంగాణ రైతులకు శుభవార్త.. రెండో విడత నిధుల విడుదలకు ముహూర్తం ఫిక్స్..
మరోవైపు, అమెరికా ప్రాధాన్యతలు మారుతున్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఇరాన్లో పాలనా మార్పు, ఎన్రిచ్డ్ యురేనియాన్ని స్వాధీనం చేసుకుంటామని ప్రకటిస్తే, ఇప్పుడు హార్ముజ్ జలసంధిని తెరిపించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ మార్గం స్వేచ్ఛా నౌకాయానానికి ఇరాన్ అనుమతించాలని, అప్పుడే కాల్పుల విరమణ ఉంటుందని ఇటీవల ట్రంప్ చెప్పారు. ఈ జలసంధిని ఇరాన్ దిగ్భందిస్తే అమెరికా ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేస్తుందని, పౌర విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. అయితే, దాడులు చేస్తే ఇజ్రాయిల్, గల్ఫ్ ప్రాంతాల్లోని యూఎస్ ఆస్తులపై భారీ దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
