అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల మాట్లాడుతూ తాను ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీని కలవాలనుకుంటున్నట్లు తెలిపారు. ఒప్పందం కుదిరితే ఖమేనీని కలవడం తనకు గౌరవంగా ఉంటుందని వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు తాజాగా ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ‘వాస్తవ ప్రపంచంలో జీవించండి’ అంటూ బదులిచ్చారు.
“ట్రంప్ మొజ్తబా ఖమేనీతో సమావేశం కావాలని అనుకుంటున్నారనే వార్తలు చూశాను. కానీ మనం వాస్తవ ప్రపంచంలో జీవిస్తూ.. వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోవాలి” అంటూ అరాఖ్చీ వ్యాఖ్యానించారు. ట్రంప్ చేసిన ప్రకటనలు ప్రస్తుత పరిస్థితులకు దూరంగా ఉన్నాయని పరోక్షంగా విమర్శించారు.
ఈ వారం ప్రారంభంలో మీడియాతో మాట్లాడిన ట్రంప్.. అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పందం కుదిరితే మొజ్తబా ఖమేనీతో సమావేశం కావడం సాధ్యమేనని అన్నారు. “నేను తప్పనిసరిగా కలవాలని కోరుకోవడం లేదు. కానీ కలిస్తే అది నాకు గౌరవంగా ఉంటుంది. ఒప్పందం కుదిరితే భేటీ జరిగే అవకాశం ఉంది” అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా-ఇరాన్ చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని కూడా తెలిపారు. “ఒప్పందం కుదరకపోవచ్చు కూడా. కానీ కుదిరితే ఈ వారాంతంలోనే జరిగే అవకాశం ఉంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఒకవైపు అమెరికా-ఇరాన్ మధ్య ఒప్పంద చర్చలు కొనసాగుతుండగా.. మరోవైపు సైనిక ఉద్రిక్తతలు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ట్రంప్ ప్రతిపాదించిన సమావేశంపై ఇరాన్ సానుకూల సంకేతాలు ఇవ్వకపోవడంతో భవిష్యత్ చర్చలపై అనిశ్చితి నెలకొంది. పశ్చిమాసియాలో శాంతి స్థిరపడుతుందా? లేక మరోసారి ఉద్రిక్తతలు మరింత పెరుగుతాయా? అన్నది అంతర్జాతీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

