ప్రస్తుతం చైనాలో కరోనా విజృంభిస్తుంది. తొలిసారి వైరస్ వెలుగు చూసిన చైనాలో మళ్లీ కేసులు పెరగడంతో ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అత్యంత వేగంగా వ్యాపించే డెల్టా వేరియంట్తో ఆదేశంలో కేసులు పెరుగుతున్నాయి. 11కు పైగా ఫ్రావిన్స్లలో కేసులు నమోదు అవుతున్నాయి. ప్రస్తుతం కేసులు కట్టడి చేస్తున్నా సమీప భవిష్యత్లో కేసులు ఒక్కసారిగా పెరిగే అవకాశముందని స్థానిక అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కరోనా వైరస్ అంటే మొదట గుర్తుకు వచ్చేది చైనానే. ప్రపంచాన్ని వణికించిన ఈ మహమ్మారి మళ్లీ వ్యాపిస్తుంది. దీంతో అక్కడి అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
ఓవైపు కరోనాతో ప్రపంచం పోరాడితే చైనా మాత్రం కేసుల సంఖ్యను తగ్గు ముఖం పట్టించింది. ఇప్పుడు తాజాగా అక్కడ కేసులు పెరుగుతుండటంతో డెల్టా వేరియంట్ విజృంభణ వేగంగా ఉండటంతో ఆందోళన చెందుతుంది.. ఇప్పటికే వారం వ్యవధిలోనే మొత్తం 11 ఫ్రావిన్స్లకు వేగంగా కేసులు వ్యాప్తి చెందడంతో అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు భయపడుతున్నారు. కరోనా పేషంట్లు ఒక రీజీయన్ నుంచి ఇంకో రీజీయన్కు ప్రయాణించారని అందుకే ఇక్కడ వేగంగా కేసులు వ్యాప్తి చెందుతున్నాయని ఆ దేశ నేషనల్ హెల్త్ మిషన్ ప్రతినిధి మీఫెంగ్ వివరించారు.
ప్రస్తుతం వైరస్ ఉన్న ప్రాంతాలు అన్ని ఎమర్జెన్సీలోకి వెళ్లాలని ఆయన సూచించారు. చైనాలోని ఇన్నర్ మంగోలియా ఎంజీనా కౌంటీలో ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సోమవారం నుంచి ఇంటికే పరిమితం కావాలని ఆదేశాలు జారీ చేశారు. గన్షు, ఇన్నర్ మంగోలియాలోని కొన్ని ప్రాంతాల్లో ట్యాక్సిలను బస్సులను నిలిపి వేశారు.
శనివారం ఒక్క రోజే 26కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇన్నర్ మంగోలియాలోని గన్షు, నింగ్జియా, హునాన్, షాంగ్జిలతో పాటు చైనా రాజధాని బీజింగ్లోను కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికిప్పుడు ఈ కేసులతో పెద్ద ముప్పు వాటిల్లకున్నా భవిష్యత్లో ముప్పు తప్పదనే అభిప్రాయాన్ని అక్కడి వైద్యాధికారులు వ్యక్తం చేస్తున్నారు. చైనాలో కేసులు సంఖ్య ఎక్కువైతే ప్రపంచానికి ముప్పు తప్పదని గత ఏడాది కాలంలో జరిగిన నష్టాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది.