Afghan-Pakistan conflict: ఆఫ్ఘనిస్తాన్-పాకిస్తాన్ మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతోంది. గురువారం, కాబూల్ నగరంపై పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ దాడులు చేసింది. తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం. శనివారం రాత్రి నుంచి ఆఫ్ఘాన్ తాలిబాన్ దళాలు సరిహద్దు వెంబడి పాకిస్తాన్ సైనిక పోస్టులే లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో 58 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్లు తాలిబాన్ అధికారులు చెబుతున్నారు. 25 పాక్ సైనిక స్థావరాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తాలిబాన్ దాడులకు పాకిస్తాన్ వణికిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.
వివాదానికి కేంద్రంగా ‘‘డ్యూరాండ్ లైన్’’..
అయితే, ఆఫ్ఘాన్-పాకిస్తాన్ మధ్య వివాదం నిన్న మొన్న ప్రారంభమైంది కాదు. ఈ వివాదానికి 132 ఏళ్ల చరిత్ర ఉంది. రెండు దేశాల సరిహద్దు రేఖ ‘‘ డ్యూరాండ్ లైన్’’ సమస్యకు మూలకారణం. సుమారు 2,640 కి.మీ (1,640 మైళ్ళు) విస్తరించి ఉన్న డ్యూరాండ్ రేఖ 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మోర్టిమర్ డ్యూరాండ్ , ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఏర్పడింది. ఈ రేఖ బ్రిటీష్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దును నిర్వచించింది. అయితే, ఈ రేఖ సరిహద్దుల్లో ఉన్న పష్టూన్లు, బలూచ్ తెగలను రెండుగా చీల్చింది.
1893 నాటి డ్యూరాండ్ రేఖను ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం లేదు. తమ పష్టూన్ల తెగకు చెందిన వారు, పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్నారని, ఇది ఆఫ్ఘనిస్తాన్కు చెందుతుందని తాలిబాన్లతో సహా, మునుపటి ఆఫ్ఘాన్ పాలకులు వాదిస్తున్నారు. పాకిస్తాన్ దీనిని ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే పాక్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు ప్రజలు తమను తాము పాకిస్తానీయులుగా చెప్పుకోవడం లేదు. ఈ ప్రాంతంలో ‘‘పాక్ తాలిబాన్లు’’ పాక్ ఆర్మీ, పోలీసులపై తీవ్రమైన దాడులు చేస్తున్నారు.
భౌగోళిక, రాజకీయ ప్రాముఖ్యత:
డ్యూరాండ్ రేఖ కేవలం మ్యాప్లో ఒక రేఖ మాత్రమే కాదు, ఇది దక్షిణాసియాలోని అత్యంత వివాదాస్పద ప్రాంతాల్లో ఒకటిగా మిగిలింది. పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు తమ సార్వభౌమాధికారం కిందకు వస్తుందని చెబుతోంది. ఇటు ఆఫ్ఘాన్ మాత్రం తమకు జరిగిన అన్యాయమని వాదిస్తోంది. తరుచుగా ఈ సరిహద్దు వెంబడి ఆఫ్ఘాన్-పాక్ సైనిక దళాలు కాల్పులకు తెగబడుతుంటాయి. అరేబియా సముద్రంలోకి ప్రవేశం కల్పించే బలూచిస్తాన్తో పాటు పష్టూన్ భూభాగాలనున తిరిగి ఇవ్వాలని ఆఫ్ఘాన్ కోరుతోంది. 2017లో సరిహద్దు వద్ద పాకిస్తాన్ కంచె నిర్మించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.