అఫ్ఘానిస్థాన్లో మరో సారి రెచ్చిపోయారు ఉగ్రవాదులు. కుందూజ్ ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. శుక్రవారం ప్రార్థనలకు వచ్చిన షియా ముస్లింలను లక్ష్యంగా చేసుకుని ఓ మసీదు వద్ద ఈ దాడి జరిగింది. కుందుజ్ ప్రావిన్స్ బందర్ జిల్లా ఖాన్ అదాబ్లో గల షియా మసీదులో జరిగిన పేలుడులో దాదాపు 100 మందికి పైగా చనిపోయినట్టు అఫ్ఘాన్ అధికార వార్త సంస్థ బక్తర్ కథనాలను బట్టి తెలుస్తోంది. అలాగే, మరో 150 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గత ఆగస్టులో అఫ్ఘానిస్థాన్ తాలిబన్ల వశమయ్యాక జరిగిన అతిపెద్ద దాడి ఇదే. మృతుల్లో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దాడి తమ పనే అని ఐసిస్ అనుబంధ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఉయ ఖోహ్రసన్ ప్రావిన్స్ – ISKP ప్రకటించింది. కాగా, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, షియా సోదరుల భద్రతకు కట్టుబడి ఉన్నట్టు తాలిబన్లు చెబుతున్నారు. ఆఫ్ఘనిస్థాన్ తాలిబన్ల పరమయ్యాయక… అక్కడ అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. గత ఆగస్టులో కాబూల్ ఎయిర్ పోర్టు వద్ద అమెరికా దళాలు లక్ష్యంగా ISKP ఆత్మాహుతి దాడులకు తెగబడింది. ఇప్పుడు కుందుజ్లో మారణహోం సృష్టించింది. ఇదిలా ఉంటే… ఇటీవల కాబూల్లో సిక్కు మైనారిటీల గురుద్వారాపై ఉగ్రవాదులు దాడి చేశారు. సీసీటీవీ కెమెరాలను, ఇతర వస్తువుల్ని ధ్వంసం చేశారు.