ఉక్రెయిన్ పై రష్యా దాడులు చేయడం ప్రారంభించి మూడో రోజుకు చేరుకుంది. మూడు రోజులుగా రష్యా ఉక్రెయిన్ మధ్య దాడులు జరుగుతున్నాయి. ఈ దాడులకు ఉక్రెయిన్ చిగురుటాకులా వణికిపోతున్నది. ఉక్రెయిన్ వాసులతో పాటు ఆ దేశంలో ఉన్న భారతీయులు అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయులను సురక్షితంగా తరలించేందుకు ఇప్పటికే పోలెండ్, హంగేరీ, రొమేనియా సరిహద్దుల్లో విమానాలను ఉంచి అక్కడి నుంచి భారతీయులు తరలించారు. ఉక్రెయిన్లో విమానాలకు ప్రవేశం నిషేదించడంతో దేశంలోని నలుమూలల ఉన్న భారతీయులను వివిధ మార్గాల ద్వారా సరిహద్దులకు తరలించి అక్కడి నుంచి స్వదేశానికి తరలిస్తున్నారు.
Read: Online Game: బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో సరికొత్త గేమ్…
ఉక్రెయిన్పై రష్యా దాడులు చేయవచ్చని వార్తలు వస్తున్న సమయంలో తమ కళాశాల నుంచి వెళ్లిపోతామని యాజమాన్యాన్ని కోరినప్పటికీ అందుకు ఒప్పుకోలేదని, రష్యా సైనిక చర్య ప్రారంభించినప్పటి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఆదేశాలు రావడంతో ఇబ్బందులు పడ్డామని, అప్పటికే దుకాణాలు మూసివేయడంతో ఆహారపదార్ధాలకు కొరత ఏర్పడిందని లీవూలో ఉంటున్న తెలుగు విద్యార్ధి విష్ణు పేర్కొన్నారు. లీవూ నుంచి పోలెండ్ సరిహద్దుల వరకు రావాలని అక్కడి నుంచి దేశానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని భారత ఎంబసీ అధికారులు పేర్కొనడంతో దాదాపు 30 కిమీ మేర నడుచుకుంటూ వెళ్లి పోలెండ్ సరిహద్దులకు వెళ్లినట్టు పేర్కొన్నారు. మైనస్ డిగ్రీల చలిలో తోటి విద్యార్ధులతో కలిసి పోలెండ్ సరిహద్దులకు చేరుకున్నట్టు తెలుగు విద్యార్ధి పేర్కొన్నారు.