శ్రీలంకలో ఆర్థిక సంక్షోభంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆందోళనకారులు ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ఆయన అందుకు ససేమిరా అంటున్నట్టు తెలుస్తోంది. దేశంలో విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటడంతో శ్రీలంక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశాల నుంచి అవసరమైన సరుకులను దిగుమతి చేసుకోలేకపోతోంది. ఫలితంగా మందులు, ఇంధనం, ఆహారంతోపాటు ఇతర నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ప్రభుత్వ అసమర్థ విధానాల పట్ల నిరసనకారులు ఆందోళనలు చేస్తూనే వున్నారు. మరోవైపు శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స రాజీనామా చేయాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈమధ్యే ఓ రేడియో ఇంటర్వ్యూలో మాట్లాడిన మహింద రాజపక్స రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను కూడా ఆయన తోసిపుచ్చారు.
ఒకవేళ మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వస్తే అది తన నాయకత్వంలోనే జరగాలన్నారు. సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకకు భారత్ భారీ సాయం ప్రకటించింది. చమురును దిగుమతి చేసుకునేందుకు దాదాపు రూ. 3,820 కోట్ల రుణ సదుపాయం అందించాలని నిర్ణయించింది. శ్రీలంక చెల్లించాల్సిన 150 కోట్ల డాలర్ల దిగుమతి బిల్లును వాయిదా వేసేందుకు భారత్ అంగీకరించింది. మరికొన్ని రుణాల గడువును కూడా పొడిగించడం శ్రీలంకకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తున్నారు.
Read Also: Lock Down Village: వెన్నెలవలస.. అక్కడ ఇప్పటికీ లాక్ డౌన్