Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ పాకిస్తాన్కు గట్టిగానే తగిలినట్లు ఉంది. మరోసారి ఈ అంశాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రస్తావించారు. కాల్పుల విరమణకు సహకరించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ప్రశంసించారు. పాకిస్తాన్ ఎల్లప్పుడూ ట్రంప్నకు రుణపడి ఉంటుందని అన్నారు. ఇస్లామాబాద్లోని అమెరికా రాయబార కార్యాలయంలో అమెరికా 250వ స్వాతంత్య్ర వేడుకలకు ఆయన హాజరయ్యారు. అమెరికా-పాకిస్తాన్ బంధం ప్రత్యేమైందని షరీఫ్ అన్నారు.
‘‘దక్షిణాసియాలో శాంతి పునరుద్ధరించి, లక్షలాది మంది ప్రాణాలను కాపాడినందుకు అధ్యక్షుడు ట్రంప్నకు మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. ఆయన శాంతికి రాయబారిగా గుర్తుండిపోతారు’’ అని అన్నారు. గతేడాది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’ పేరుతో పాకిస్తార్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి, వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. భారత్పై దాడి చేసేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బతీసింది. పాక్ వైమానిక దళానికి చెందిన పలు ఎయిర్బేసుల్ని భారత్ ధ్వంసం చేసింది. ఈ యుద్ధం ఆగేందుకు తానే సహకరించినట్లు ట్రంప్ పలుమార్లు చెప్పుకున్నారు. అయితే, దీంట్లో మూడో దేశం జోక్యం లేదని, పాకిస్తాన్ కాళ్ల బేరానికి రావడంతోనే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు భారత్ స్పష్టం చేసింది.
మరోవైపు ట్రంప్ నాయకత్వాన్ని ప్రశంసించిన షాబాష్ షరీఫ్, అమెరికా విదేశాంగ విధానానికి కొత్త శక్తిని తెచ్చారని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా శాంతి, అభివృద్ధి, స్థిరత్వం కోసం ట్రంప్ పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇదే సమయంలో ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతల్ని తగ్గించే ప్రయత్నాల్లో పాకిస్తాన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పుకొచ్చారు. ప్రాంతీయ శాంతి కోసం తమ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేస్తున్న కృషిని ప్రశంసించారు.
