Israel Iran War: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం తీవ్రం అవుతోంది. ఇజ్రాయిల్ ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీని చంపేసిన తర్వాత ప్రతీకార దాడులకు దిగింది. ఇజ్రాయిల్తో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరాలపై దాడులు చేస్తోంది. కువైట్, సౌదీ అరేబియా, బహ్రైయిన్, ఖతార్, యూఏఈలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ ఘర్షణ ప్రారంభమై వారం గడుస్తోంది. ప్రతీ రోజూ కూడా అమాయకులు చనిపోతున్నారు. మరోవైపు హార్మూజ్ జలసంధిని ఇరాన్ మూసేయడంతో చమురు సంక్షోభం ఏర్పడింది.
ఇదిలా ఉంటే, ఖతార్ నుంచి హెచ్చరిక వచ్చింది. ఖతార్ ఇంధన మంత్రి సాద్ అల్ కాబి మాట్లాడుతూ.. మధ్యప్రాచ్యం నుంచి ఇంధన సరఫరా నిలిచిపోతే, ఈ సంక్షోభం ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేయగలదని హెచ్చరించారు. “యుద్ధం వల్ల చమురు ఎగుమతులు ప్రభావితమైతే, ముడి చమురు ధరలు రాబోయే రెండు నుండి మూడు వారాల్లో బ్యారెల్కు $150 కంటే ఎక్కువగా పెరగవచ్చు” అని చెప్పారు. యుద్ధం ముగిసినప్పటికీ, చమురు సరఫరా సాధారణ స్థాయికి రావడానికి వారాల నుంచి నెలల సమయం పట్టవచ్చని అన్నారు.
Read ALSO: Sukhoi Crash: సుఖోయ్ విషాదం.. ఆపరేషన్ సిందూర్లో పాల్గొన్న పైలట్ మృతి..
ప్రపంచంలోనే అతిపెద్ద న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తిదారుగా ఉన్న ఖతార్లోని ప్రధాన ఎల్ఎన్జి ప్లాంట్ అయిన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీలో ఎల్ఎన్జి ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. ప్రపంచ గ్యాస్ సరఫరాను దెబ్బతీసింది. ఇదే కాకుండా యూఏఈ, సౌదీ అరేబియాల్లోని ఆయిల్ రిఫైనరీలను ఇరాన్ దెబ్బతీసింది.
ఇదిలా ఉంటే సంక్షోభాన్ని నివారించడానికి భారత్ చర్యలు తీసుకుంటోంది. రష్యా నుంచి చమురు దిగుమతుల్ని పెంచాలని భావిస్తోంది. మరోవైపు, యుద్ధం కారణంగా సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉండటంతో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఎల్పీజీ(LPG) కర్మాగారాలను ఉత్పత్తి పెంచాలని ఆదేశించింది.