Pakistan: పాకిస్థాన్లో ప్రభుత్వం, సైన్యం మధ్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది. దేశ ప్రస్తుత పాలనా వ్యవస్థ, కొత్త ప్రావిన్సుల ఏర్పాటు అవసరంపై హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారాయి. దీంతో పరిపాలనా సంస్కరణల విషయంలో ప్రభుత్వం, సైన్యం మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయా అనే ప్రశ్నలు విశ్లేషకుల్లో తలెత్తుతున్నాయి. నఖ్వీ చేసిన కామెంట్స్పై తాజాగా పాకిస్థాన్ సైనిక మీడియా విభాగం ఐఎస్పీఆర్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి స్పందించారు. కొత్త ప్రావిన్సుల ఏర్పాటు లేదా పరిపాలనా నిర్మాణంలో మార్పులు చేయడం సైన్యం పరిధిలోని అంశం కాదని స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయాలు ప్రజలు ఎన్నుకున్న రాజకీయ నాయకత్వం, రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే తీసుకోవాలని పేర్కొన్నారు.
హోం మంత్రి వ్యాఖ్యలపై రియాక్షన్
మీడియా సమావేశంలో హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలపై ఆయనను ప్రశ్నించగా, అవి నఖ్వీ వ్యక్తిగత అభిప్రాయాలని, వాటిపై తాము వ్యాఖ్యానించబోమని డీజీ ఐఎస్పీఆర్ తెలిపారు. అయితే పాకిస్థాన్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మెరుగైన పాలన, సమర్థవంతమైన పరిపాలనా వ్యవస్థే పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. ప్రస్తుతం అమలులో ఉన్న పాలనా వ్యవస్థ దేశ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైందని వ్యాఖ్యానించారు. నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టకపోతే మరో పదేళ్ల తర్వాత కూడా పాకిస్థాన్ ఇదే సమస్యలతో సతమతమవుతుందని హెచ్చరించారు. పరిపాలనా సంస్కరణలు, కొత్త ప్రావిన్సుల ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు ప్రజల సంకల్పం, వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల ద్వారానే జరగాలని లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి పునరుద్ఘాటించారు. దేశంలోని రాజకీయ, పరిపాలనా అంశాలన్నీ రాజ్యాంగం, చట్టం, ప్రజాస్వామ్య వ్యవస్థ పరిధిలోనే పరిష్కారం కావాలని సూచించారు. 1972లో పాకిస్థాన్ జనాభా 4 నుంచి 5 కోట్ల మధ్య ఉండేదని, ప్రస్తుతం జనాభా భారీగా పెరిగిందని చౌదరి గుర్తు చేశారు. మారుతున్న జనాభా, సాంకేతికత, దేశ అవసరాలకు అనుగుణంగా పరిపాలనా వ్యవస్థలో మార్పులు అవసరమా అనే అంశంపై చర్చ జరగడం సహజమేనని పేర్కొన్నారు. జాతీయ కార్యాచరణ ప్రణాళికలోని 14 అంశాలపై ప్రభుత్వం, ప్రతిపక్షాలతో పాటు ప్రధాన రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చాయని ఆయన వెల్లడించారు. ఉగ్రవాద నిర్మూలన, మదర్సా సంస్కరణలు, ఆఫ్ఘన్ శరణార్థుల పునరావాసం వంటి అంశాలు కూడా మెరుగైన పాలనలో భాగమేనని ఆయన స్పష్టం చేశారు.

