Pakistan: బలూచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)ను ఎదుర్కోవడంలో తమ సైన్యం వల్ల కావడం లేదని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు. బలూచిస్తాన్ విస్తీర్ణం పెద్దది కావడంతో పాక్ భద్రతా బలగాలు అలసిపోతున్నాయని చెప్పారు. జాతీయ అసెంబ్లీలో మాట్లాడిన ఆయన… పాకిస్తాన్లో అతిపెద్ద రాష్ట్రమైన బలూచిస్తాన్ విస్తీర్ణమే భద్రతా బలగాలకు ప్రధాన సవాల్ అని అన్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ దాడుల నేపథ్యంలో ఆసిఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Read Also: Adani-Italy Deal: అదానీ-లియోనార్డో కీలక ఒప్పందం.. భారత్లో హెలికాప్టర్ ఉత్పత్తి..
బలూచిస్తాన్ భూభాగం పాకిస్తాన్లో 40 శాతానికి పైగా ఉందని, జనసాంద్రత ఉన్న నగరాలను నియంత్రించడం కన్నా, ఇంత పెద్ద ప్రాంతాన్ని కాపాడటం చాలా కష్టమని, భారీ సంఖ్యలో బలగాలు అవసరం అవుతాయని అన్నారు. సైన్యం అక్కడ పనిచేస్తున్నా, అంత పెద్ద ప్రాంతాన్ని గస్తీ కాయడం వల్ల మా సైన్యం అలసిపోతోందని రక్షణ మంత్రి చెప్పారు.
బలూచిస్తాన్లో బీఎల్ఏ సమన్వయ దాడులకు పాల్పడింది. పాక్ ప్రభుత్వం చెబుతున్న లెక్కల ప్రకారం 177 మంది తిరుగుబాటుదారుల్ని హతమార్చామని, ఈ ఆపరేషన్లో 17 మంది పోలీస్, భద్రతా సిబ్బంది చనిపోయినట్లు చెప్పారు. అయితే, బీఎల్ఏ మాత్రం 200 మంది పాక్ సిబ్బందిని హతమార్చినట్లు చెబుతోంది. ఇదిలా ఉంటే, బలూచ్ లిబరేషన్ ఆర్మీతో చర్చించే ప్రసక్తే లేదని ఖవాజా ఆసిఫ్ స్పష్టం చేశారు. మహిళలు, పిల్లల్ని చంపే ఉగ్రవాదులతో చర్చలే ఉండవని అన్నారు. బలూచిస్తాన్లో అనేక అభివృద్ధి పనులు జరుపుతున్నారని వెల్లడించారు. బలూచిస్తాన్లో ప్రజలు మిస్ అవుతున్నారనే విషయంపై స్పందిస్తూ.. ఉగ్రవాదులు, నేరగాళ్లు దీనిని తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అన్నారు.