Netanyahu: ఇజ్రాయిల్కు అత్యంత సన్నిహిత, శక్తివంతమైన మిత్రదేశం అమెరికా కావచ్చు, కానీ అది ఒక్కటి మాత్రమే ఇజ్రాయిల్ మిత్రదేశం కాదని ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వ్యాఖ్యలకు కౌంటర్గా ఇజ్రాయిల్ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఇజ్రాయిల్కు ఎన్నో మంచి మిత్రదేశాలు ఉన్నాయని, భారత్ కూడా ఇందులో ఒకటి అని నెతన్యాహూ పేర్కొన్నారు. ఇరాన్తో ట్రంప్ కుదుర్చుకున్న శాంతి ఒప్పందానికి ఇజ్రాయిల్ నేతలు మద్దతు ఇవ్వాలని జేడీవాన్స్ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజుల తర్వాత నెతన్యాహూ నుంచి ఈ ప్రకటన వచ్చింది.
జేడీ వాన్స్ ప్రకటనపై వ్యంగ్యంగా స్పందిస్తూ.. ‘‘ భారత్ అనే ఒక చిన్న దేశం లాంటి మరికొంత మంది మిత్రులు ఇజ్రాయిల్కు ఉన్నారు. అక్కడ 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. నిజం చెప్పాంటే అక్కడ మాకు అపారమైన మద్దతు ఉంది’’ అని నెతన్యాహూ అన్నారు. అమెరికా మాత్రమే ఇజ్రాయిల్కు ఏకైక మిత్రదేశమనే వ్యాఖ్యల్ని ఖండించారు. తనకు జేడీ వాన్స్తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని చెబుతూనే, అన్ని విషయాల్లో ఇద్దరి మధ్య ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. వైట్హౌజ్లో మాకు లభించిన అత్యంత గొప్ప స్నేహితుడు ట్రంప్ అని నెతన్యాహూ ప్రశంసలు కురిపించారు. ట్రంప్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.
జేడీ వాన్స్ ఏమన్నారు?
ఇటీవల యూఎస్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ మాట్లాడుతూ.. ప్రస్తుతం ప్రపంచంలో ఇజ్రాయిల్కు అమెరికానే ఏకైక శక్తివంతమైన మిత్రదేశమని అన్నారు. ఇరాన్తో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందాన్ని విమర్శించకుండా, ఇజ్రాయిల్ మద్దతు ఇవ్వాలని సూచించాడు. సైనిక చర్యలతోనే అన్ని భద్రతా సమస్యలకు పరిష్కారం లభించదని చెప్పారు.
దీనికి కౌంటర్గా నెతన్యాహూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని అనేక దేశాలు తమకు మద్దతు తెలుపుతున్నాయని చెప్పారు. సైబర్ టెక్నాలజీ, ఏఐ, రక్షణ రంగాల్లో ఇజ్రాయిల్తో కలిసి పనిచేయడానికి అనేక దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయని అన్నారు. లెబనాన్లో ఇజ్రాయిల్ సైనిక చర్యను సమర్థించారు. తమ దేశానికి ముప్పు కలిగించే ఏ శక్తుల నుంచైనా రక్షించుకునే హక్కు ఇజ్రాయిల్కు ఉందని స్పష్టం చేశారు.

