Mojtaba Khamenei: శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి.. ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం

  • శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలి
  • జాతీయ ఐక్యతే బలం
  • ఇరానీయులకు మొజ్తబా ఖమేనీ సందేశం
  • ఇజ్రాయెల్ కేన్సర్ కణితిలాంటిందని వ్యాఖ్య
Mojtabakhamenei

Mojtabakhamenei

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరానీయులకు సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ కీలక సందేశం పంపించారు. శత్రువుల కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని జాతీయ ఐక్యతే తమ బలంగా పేర్కొన్నారు. యుద్ధరంగంలో ఓటమి చెందిన శత్రువులు ఇప్పుడు ప్రజల్లో నిరాశ, విభేదాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు.

గురువారం విడుదల చేసిన సందేశంలో ఖమేనీ మాట్లాడుతూ.. “యుద్ధభూమిలో తమ లక్ష్యాలను సాధించలేకపోయిన శత్రువులు ఇప్పుడు మానసిక యుద్ధానికి దిగారు. ప్రజల ధైర్యసాహసాలను దెబ్బతీయడం, దేశంలో అంతర్గత విభేదాలు సృష్టించడం వారి ప్రధాన లక్ష్యం” అని పేర్కొన్నారు. ప్రజల్లో నిరాశ, నిస్పృహను పెంచే లేదా దేశ భవిష్యత్తుపై ప్రతికూల భావనలు కలిగించే ఏ చర్యైనా శత్రువులకు సహకరించినట్టేనని హెచ్చరించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజలందరూ ఒకే తాటిపై నిలవాలని సూచించారు. ఇక ఇజ్రాయెల్‌ను కేన్సర్ కణితితో పోల్చారు. జియోనిస్ట్ పాలన ఎంతో కాలం మనుగడ సాధించదని పేర్కొన్నారు.

×
×
Ad

ఈ సందేశాన్ని ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు రుహుల్లాహ్ ఖోమేకిని వర్ధంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన తరఫున చదివి వినిపించారు. అలాగే ప్రముఖ షియా మత పర్వదినం సందర్భంగా కూడా ఈ సందేశాన్ని ప్రజలకు తెలియజేశారు. ఇటీవలి కాలంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు, యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఖమేనీ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశ భద్రత, స్థిరత్వాన్ని కాపాడేందుకు జాతీయ ఐక్యత అవసరమని ఖమేనీ మరోసారి స్పష్టం చేశారు.

ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ పరిస్థితులు మాత్రం ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి. అణు ఒప్పందం దగ్గరే అసలు సమస్య వస్తోంది. దీనికి దగ్గర పంచాయితీ తెగకపోవడంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.