ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ.. ప్రధాని మోడీకి ప్రత్యేక సందేశం పంపారు. ఇటీవల ఈద్ అల్-అదా సందర్భంగా ప్రధాని మోడీ పంపిన శుభాకాంక్షలకు ప్రతిస్పందిస్తూ.. భారత్-ఇరాన్ మధ్య చారిత్రక స్నేహబంధం మరింత బలపడుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఇరాన్కు చెందిన వర్గాల సమాచారం ప్రకారం.. ప్రధాని మోడీ పంపిన ఈద్ శుభాకాంక్షల సందేశాన్ని అందుకున్న మొజ్తబా ఖమేనీ అందుకు కృతజ్ఞతలు తెలిపారు.
సందేశంలో మొజ్తబా.. ‘‘గౌరవనీయ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారూ.. ఈద్ అల్-అదా సందర్భంగా మీరు పంపిన శుభాకాంక్షల సందేశం నాకు అందింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ.. నా తరఫున కూడా మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పరస్పర గౌరవం, ఉమ్మడి ప్రయోజనాలపై నిర్మితమైన మన రెండు దేశాల చారిత్రక స్నేహం.. ఇరు ప్రభుత్వాల కృషితో భవిష్యత్తులో మరింత బలపడుతూ విస్తరిస్తుందని నాకు పూర్తి నమ్మకం ఉంది.’’ అని పేర్కొన్నారు. అలాగే ప్రధాని మోడీ ప్రభుత్వం, భారత ప్రజలు మరింత అభివృద్ధి సాధించాలని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు కూడా తన సందేశంలో తెలిపారు.
మొజ్తబా తొలి ప్రత్యక్ష సందేశం
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఫిబ్రవరిలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతల్లా అలీ ఖమేనీ మరణించిన అనంతరం.. ఆయన కుమారుడు మొజ్తబా ఖమేనీ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్.. అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధాని మోడీకి ఆహ్వానం పంపారు. అయితే ముందుగా నిర్ణయించిన విదేశీ పర్యటనల కారణంగా ప్రధాని మోడీ ఆ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నారు. అయితే సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొజ్తబా ఖమేనీ నేరుగా ప్రధాని మోడీకి సందేశం పంపడం ఇదే తొలిసారి కావడం విశేషం. మరోవైపు అమెరికా దాడుల్లో తీవ్రంగా గాయపడినట్లు వార్తలు వచ్చినప్పటి నుంచి మొజ్తబా ఖమేనీ ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితిపై కూడా అంతర్జాతీయంగా చర్చ కొనసాగుతోంది.
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. చనిపోయి దాదాపు 100 రోజులకు పైగా అయింది. అయితే అంత్యక్రియల సమయంలో మళ్లీ దాడులు జరగవచ్చన్న సంకేతాలు నేపథ్యంలో అప్పుడు నిర్వహించలేదు. ప్రస్తుతం ఇరాన్-అమెరికా మధ్య శాంతి ఒప్పందం జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణిగాయి. ఈ నేపథ్యంలో ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించాలని ఇరాన్ ప్రభుత్వం ఆలోచించింది. ఈ నేపథ్యంలో జూలై 4 నుంచి వారం రోజుల పాటు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ నలుమూలల నుంచి దాదాపు 20 కోట్ల వరకు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఆయా దేశాల నుంచి అతిథులను ఇరాన్ ఆహ్వానించింది. ఇందులో భాగంగా ప్రధాని మోడీని కూడా ఆహ్వానించారు. అయితే ముందస్తు షెడ్యూల్ కారణంగా మోడీ హాజరు కావడం లేదు. ఖమేనీ అంత్యక్రియలకు ఇరాక్, పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్, రష్యా, చైనా, మధ్య ఆసియా దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు కూడా హాజరుకానున్నారు. 2024లో ఇరాన్ మాజీ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించినప్పుడు కూడా భారత్ తరఫున అప్పటి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అధికారిక సంతాప కార్యక్రమాలకు హాజరయ్యారు.

