లెబనాన్పై ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. బుధవారం ఇజ్రాయెల్ జరిపిన దాడిలో మృతుల సంఖ్య 254కు చేరింది. వందలాది మంది గాయపడ్డారు. ప్రస్తుతం లెబనాన్-ఇజ్రాయెల్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఇరాన్-అమెరికా మధ్య 2 వారాల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. దీనికి ఇజ్రాయెల్ కూడా మద్దతు తెలిపింది. దీంతో 40 రోజుల యుద్ధానికి తెరపడిందని అంతా భావించారు. రెండు వారాల పాటు పశ్చిమాసియా ప్రశాంతంగా ఉంటుందని భావించారు. కానీ బుధవారం అందుకు భిన్నంగా వాతావరణం నెలకొంది. ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని ఇజ్రాయెల్ తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఒక్కసారిగా వైమానిక దాడులతో లెబనాన్పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. భారీ భవంతలు కూలిపోయాయి. ఇప్పటి వరకు 254 మంది చనిపోగా.. వందలాది మంది గాయపడ్డారు.
అసలేం జరిగిందంటే..
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమయ్యారు. ఆయనతో పాటు కీలక నేతలంతా మృత్యువాత పడ్డారు. అయితే ఇరాన్కు మద్దతుగా ఇజ్రాయెల్పై లెబనాన్ వైమానిక దాడులు చేసింది. దీంతో ప్రతీకారంగా హిజ్బుల్లా ఉగ్రవాదులే లక్ష్యంగా దక్షిణ లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. తాజాగా ఇరాన్తో జరిగిన ఒప్పందం లెబనాన్కు ఏ మాత్రం వర్తించదని ఇజ్రాయెల్ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ భారీ స్థాయిలో దాడులు చేసింది.

అయితే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు చేయడాన్ని ఇరాన్ జీర్ణించుకోలేపోయింది. ఒప్పందం ఉల్లంఘించారంటూ ధ్వజమెత్తింది. అయితే ఈ ఒప్పందం లెబనాన్కు వర్తించదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కూడా తేల్చి చెప్పారు. ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని టెహ్రాన్ పొరబడిందని… వాస్తవానికి దానికి అమెరికా అంగీకరించలేదని తేల్చి చెప్పారు.
ఇదిలా ఉంటే లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్, స్పెయిన్ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ ఖండించారు. ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్లో ఐదో వంతు మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
ఇక ఇజ్రాయెల్ జరిపిన దాడుల అనంతరం గురువారాన్ని జాతీయ సంతాప దినంగా లెబనాన్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 254 మందికి పైగా మరణించగా.. 1,000 మందికి పైగా గాయపడినట్లు తెలిపింది. ఇజ్రాయెల్ హత్యా యంత్రాగాన్ని అడ్డుకునేందుకు దౌత్య ప్రయత్నాలు చేస్తున్నట్లు లెబనాన్ ప్రధానమంత్రి నవాఫ్ సలాం కార్యాలయం తెలిపింది.