Iran: అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయిల్ భూభాగంలోకి ప్రవేశించి క్రూరంగా ఊచకోత కోసింది. పిల్లలు, మహిళలనే తేడా లేకుండా చంపేసింది. ఈ దాడుల్లో 1400 మంది మరణించారు. 200 మందికి పైగా ఇజ్రాయిలీలను బందీలుగా చేసుకున్న హమాస్ తీవ్రవాదులు వారిని గాజా స్ట్రిప్ లోకి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయిల్ సైన్యం గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో వేల సంఖ్యలో సాధారణ ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికే ఈ దాడుల వల్ల 8 వేల మంది వరకు మరణించినట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో గాజాస్ట్రిప్ పై బాంబు దాడుల్ని నిలిపివేయాలని ఇరాన్ డిమాండ్ చేసింది. ఇజ్రాయిల్కి చమురు, ఆహార ఎగుమతులను నిలిపేయాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ముస్లిం దేశాలకు పిలుపునిచ్చారు. గాజాపై బాంబు దాడులు తక్షనమే ఆగిపోవాలి. జియోనిస్ట్ పాలనకు చమురు, ఆహార ఎగుమతుల మార్గాలని నిలిపేయాలని, అలీ ఖమేనీ ఒక ప్రసంగంలో పేర్కొన్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపింది.
మరోవైపు ఇరాన్తో పాటు ఇతర దేశాల హెచ్చరికలను ఇజ్రాయిల్ లెక్కచేయడం లేదు. హమాస్ సంస్థను లేకుండా చేస్తామని ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇజ్రాయిల్ సైన్యం వైమానిక దాడులతో పాటు భూతల దాడుల్ని నిర్వహిస్తోంది. గాజా ప్రాంతంలోని హమాస్ ఉగ్రవాద స్థావరాలను, ఉగ్రవాదుల్ని వెతికి మరీ మట్టుబెడుతోంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 7 నాటి హమాస్ దాడుల వెనక ఇరాన్ ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణల్ని ఇరాన్ ఖండించింది.