పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారేటట్టు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతున్నప్పటికీ.. ఉద్రిక్తతలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. మధ్యవర్తుల ద్వారా శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ కొలిక్కి రావడం లేదు. దీంతో అవే ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇక లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
అమెరికాతో చర్చలు నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా హార్ముజ్ దిగ్బంధం మరింత కఠినం చేయబోతున్నట్లుగా ఇరాన్కు చెందిన వార్తా సంస్థలు వెల్లడించాయి. ఇరాన్ అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. లెబనాన్ కూడా కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించిన కీలక అంశాల్లో భాగమని.. ప్రస్తుతం ఇజ్రాయెల్ చర్యలతో ఆ ఒప్పందం పూర్తిగా ఉల్లంఘించబడిందని టెహ్రాన్ ఆరోపిస్తోంది. ఈ పరిస్థితుల్లో మధ్యవర్తుల ద్వారా అమెరికాతో జరుగుతున్న చర్చలు, పత్రాల మార్పిడిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఇరాన్ చర్చల బృందం తెలిపినట్లు వార్తలు వచ్చాయి.
ఇరాన్ అధికారులు, చర్చల ప్రతినిధులు స్పష్టం చేసినట్లుగా.. ఇజ్రాయెల్ సైన్యం.. గాజా, లెబనాన్ ప్రాంతాల్లో కొనసాగిస్తున్న దాడులను వెంటనే నిలిపివేయాలని.. అలాగే లెబనాన్లో ఆక్రమిత ప్రాంతాల నుంచి పూర్తిగా వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేరే వరకు అమెరికాతో ఎలాంటి చర్చలు ఉండవని ఇరాన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిపై కూడా ఇరాన్ కఠిన వైఖరి అవలంబించినట్లు సమాచారం. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్ముజ్ను పూర్తిగా దిగ్బంధించాలని టెహ్రాన్ నిర్ణయించినట్లు వార్తలు వెలువడ్డాయి. అంతేకాకుండా బాబ్ అల్-మండబ్ జలసంధి సహా ఇతర కీలక సముద్ర మార్గాల్లో కూడా ఒత్తిడి పెంచే చర్యలు చేపట్టే అవకాశముందని పేర్కొన్నాయి.
హార్ముజ్ జలసంధి ద్వారా ప్రపంచ చమురు, ఎల్ఎన్జీ రవాణాలో గణనీయమైన భాగం జరుగుతుండటంతో ఇరాన్ తాజా నిర్ణయం అంతర్జాతీయ ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా-ఇరాన్ సంబంధాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలో ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో పరిస్థితులను మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో వేచి చూడాలి.
