మధ్యప్రాచ్యంలో యుద్ధం అత్యంత భయంకరమైన , ప్రమాదకరమైన దశకు చేరుకుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇరాన్లోని నతాన్జ్ అణు కేంద్రం, ఇజ్రాయెల్లోని దిమోనా అణు సదుపాయం ఉన్న నగరంపై దాడులు జరిగినట్లు వచ్చిన నివేదికలతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనలపై అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (IAEA) ప్రస్తుతం లోతైన దర్యాప్తు చేస్తోందని, ప్రస్తుతానికి రేడియేషన్ స్థాయుల్లో ఎలాంటి అసాధారణ పెరుగుదల నమోదు కానప్పటికీ, అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవడం ప్రజారోగ్యానికి , పర్యావరణానికి కోలుకోలేని పెను ముప్పును సృష్టిస్తుందని ఆయన హెచ్చరించారు. యుద్ధం శాంతిని తీసుకురాదని, అది కేవలం రాబోయే తరాలకు ద్వేషించడానికి కొత్త కారణాలను మాత్రమే నేర్పుతుందని వ్యాఖ్యానిస్తూ, అన్ని పక్షాలు అత్యంత సైనిక సంయమనం పాటించాలని, శాంతే అన్నిటికీ ఉత్తమ ఔషధమని ఆయన పిలుపునిచ్చారు. సాధ్యమైన అణు ప్రమాదాలను ఎదుర్కోవడానికి ఇప్పటికే 13 దేశాల్లో తమ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చినట్లు కూడా ఆయన వెల్లడించారు.
Digital Payments: ఏప్రిల్ 1 నుంచి UPI, కార్డ్ పేమెంట్స్ మారతాయి.. RBI భద్రతా నిబంధనలు ఏమిటి?
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు అత్యంత కఠినమైన హెచ్చరికలు జారీ చేయడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. హర్మూజ్ జలసంధిని రాబోయే 48 గంటల్లోగా పూర్తిగా తెరవకపోతే, ఇరాన్లోని విద్యుత్ ప్లాంట్లను ధ్వంసం చేస్తామని ఆయన అల్టిమేటం ఇచ్చారు. ముఖ్యంగా ఆ దేశంలోని అతిపెద్ద ప్లాంట్ను మొదటగా లక్ష్యం చేసుకుంటామని తన సోషల్ మీడియా పోస్టుల ద్వారా స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ నౌకాదళం, వాయుసేన , యాంటీ-ఎయిర్క్రాఫ్ట్ వ్యవస్థలను తాము నిర్వీర్యం చేశామని, తమ సైనిక లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నామని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అమెరికా హెచ్చరికలను ఇరాన్ తోసిపుచ్చుతూ, హర్మూజ్ జలసంధి ప్రస్తుతం తెరిచే ఉందని, కానీ శత్రుదేశాలకు మాత్రం అందులోకి ప్రవేశం లేదని ఖరాఖండిగా స్పష్టం చేసింది. ఈ పరిణామాలతో అగ్రరాజ్యం అమెరికా , ఇరాన్ మధ్య యుద్ధం ఎప్పుడైనా సంభవించేలా వాతావరణం నెలకొంది.