ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా ఎన్నికయ్యాడు. దాదాపు వారం రోజులు గడుస్తోంది. కానీ ఇప్పటి వరకు బహిరంగంగా ఎక్కడా ప్రత్యక్షం కాలేదు. దీంతో మోజ్తాబా పరిస్థితిపై రకరకాలైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా అంతర్జాతీయ మీడియాలో సరికొత్త కథనాలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ కథనాలపై ఇరాన్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం విశేషం.
ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన సంయుక్త దాడిలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతమయ్యాడు. అనంతరం కొత్త సుప్రీం లీడర్గా మార్చి 8న మోజ్తాబా ఖమేనీ ఎన్నికయ్యాడు. మోజ్తాబా మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఇరాన్ మీడియా తెలిపింది. కానీ ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు.
ఈ నేపథ్యంలో ఇరాన్ కొత్త లీడర్ మోజ్తాబా ఆరోగ్యంపై అనేక ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా బ్రిటిష్ వార్తాపత్రిక ‘‘ది సన్’’ సంచలన కథనాన్ని ప్రచురించింది. మోజ్తాబా కోమాలో ఉన్నారని.. పరిస్థితి విషమంగా ఉందని స్పష్టం చేసింది.
ప్రస్తుతం మోజ్తాబా ఆరోగ్య పరిస్థితిని ఇరాన్ ఆరోగ్య, విద్యామంత్రి మొహమ్మద్ రెజా జాఫర్ గాండి ఆస్పత్రిలో ఉండి పర్యవేక్షిస్తున్నారని పేర్కొంది. టెహ్రాన్లోని సినా యూనివర్శిటీ ఆస్పత్రిలో ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారని.. భవనంలోని ఒక భాగాన్ని భారీ భద్రత మధ్య మూసివేసినట్లుగా తన కథనంలో నివేదించింది. అలాగే మోజ్తాబా ఒక కాలును కూడా కోల్పోయాడని.. కడుపు, కాలేయానికి తీవ్ర గాయాలు అయినట్లుగా వెల్లడించింది. ఫిబ్రవరి 28న ఖమేనీ చనిపోయినప్పుడే మోజ్తాబా కూడా తీవ్రంగా గాయపడినట్లుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇరాన్ మీడియా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ‘‘రంజాన్ శౌర్యం’’, ‘‘గాయపడిన యోధుడు’’ అంటూ కొనియాడింది.
రెండు రోజుల క్రితం ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్ రహస్యంగా మోజ్తాబా ఖమేనీని సందర్శించారని నివేదికలో పేర్కొంది. సినా ఆస్పత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి కొంతమంది అధికారం కలిగిన వ్యక్తులను మాత్రమే అనుమతిస్తారని తెలిపింది. అయితే మోజ్తాబా ఆరోగ్యంపై ఇంత పెద్ద ఎత్తున వదంతులు వ్యాపిస్తున్నా ఇప్పటి వరకు ఇరాన్ ప్రభుత్వం స్పందించలేదు.
ఇక వెలుగులోకి వచ్చిన మోజ్తాబా ఫొటోలు కృత్రిమ ఛాయాచిత్రాలు అని బీబీసీ తెలిపింది. ఏఐ ఆధారిత ఫొటోలు అని పేర్కొంది. ఇక మోజ్తాబా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కీలుబొమ్మగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అభివర్ణించారు. ఒకవేళ కీలు బొమ్మ కాకపోతే ఎందుకు బహిరంగంగా కనిపించడం లేదని నిలదీశారు.
