Iran: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు జరుగుతున్నాయి. వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు నివాళులు అర్పిస్తున్నారు. కోట్లాదిగా ఇరాన్ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే, ఇరాన్ యుద్ధం తర్వాత కూడా తమ ‘‘కూటమి’’ బలంగా ఉందని నిరూపించుకుంటోంది. ముఖ్యంగా ‘‘ట్రిపుల్ హెచ్’’ అంటే హౌతీలు, హమాస్, హిజ్బుల్లాకు చెందిన కీలక ప్రతినిధులు కూడా ఈ అంత్యక్రియలకు హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. తమ ‘‘ప్రతిఘటన కూటమి’’ ఇంకా ముగిసిపోలేదని మిడిల్ ఈస్ట్ రాజకీయాలకు మరోసారి గుర్తు చేసింది.
ముఖ్యంగా, ఇజ్రాయిల్కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ యుద్ధం, గాజా యుద్ధాల తర్వాత ఈ మూడు శక్తులు నాశనమయ్యాయని అంతా భావించారు. కానీ ఇంకా కథ మిగిలే ఉందని ఇరాన్ ప్రపంచానికి చాటిచెప్పింది. ఈ మిలిటెంట్ గ్రూపులు శనివారం ఖమేనీ అంత్యక్రియలకు హాజరైనట్లు అక్కడి ప్రభుత్వ మీడియా వెల్లడించింది. ఇదే కాకుండా హిజ్బుల్లా, హమాస్ ప్రతినిధులు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీతో సమావేశమయ్యారు. అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఈ మూడు సంస్థల్ని ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాయి.
పాలస్తీనా ముఖ్యంగా గాజాలో హమాస్, లెబనాన్ దక్షిణ భాగంలో హిజ్బుల్లా, యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులకు చాలా ఏళ్లుగా ఇరాన్ సహాయం చేస్తుందనేది బహిరంగ సత్యం. ఇజ్రాయిల్కు వ్యతిరేకంగా ఈ మూడింటిని ఇరాన్ ప్రాక్సీలుగా వాడుకుంటోంది. 2023 అక్టోబర్ 7 నాటి ఇజ్రాయిల్ దాడి ఘటనలో హమాస్కు ఇరాన్ సహాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడి తర్వాత ఇజ్రాయిల్ హమాస్ హై లెవల్ లీడర్షిప్ను తుడిచిపెట్టేసింది. మరోవైపు, లెబనాన్ నుంచి ఇజ్రాయిల్పై హిజ్బుల్లా దాడులు చేస్తే, వారిని కూడా ఇజ్రాయిల్ చావు దెబ్బ కొట్టింది. అయినప్పటికీ, ఈ రెండు గ్రూపులు ఇంకా మిగిలే ఉన్నాయనే సందేశాన్ని ఇరాన్ ఇచ్చినట్లు అయింది.

