పశ్చిమాసియాలో నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇజ్రాయెల్పై కొనసాగిస్తున్న సైనిక చర్యలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇదే సమయంలో ఇజ్రాయెల్ మళ్లీ దాడులకు దిగితే గతం కంటే మరింత తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని గట్టిగా హెచ్చరించింది.
ఇరాన్ అధికారులు మాట్లాడుతూ.. “ఇజ్రాయెల్పై మా సైనిక చర్యలను నిలిపివేస్తున్నాం. కానీ ఇజ్రాయెల్ తిరిగి లెబనాన్పై దాడులు ప్రారంభిస్తే మరింత బలమైన శక్తితో ప్రతిస్పందిస్తాం” అని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని ఇరాన్ సాయుధ దళాలు కూడా ప్రత్యేక ప్రకటనలో ధృవీకరించాయి. ప్రస్తుతం సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని.. అయితే ఈ కాల్పుల విరమణ పూర్తిగా షరతులకు లోబడి ఉంటుందని పేర్కొన్నాయి. “ఇజ్రాయెల్ దూకుడు చర్యలు లేదా దక్షిణ లెబనాన్పై దాడులు కొనసాగితే గతం కంటే మరింత తీవ్రమైన, విధ్వంసకర చర్యలు తీసుకుంటాం” అని హెచ్చరించాయి.
ఈ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. ఇరాన్, ఇజ్రాయెల్ రెండూ తక్షణ కాల్పుల విరమణ కోరుకుంటున్నాయని పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో “ఇజ్రాయెల్- ఇరాన్ రెండూ వెంటనే కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నాయి. శాంతి చర్చలు కొనసాగుతున్నాయి. అవి విజయవంతం కావాలని ఆశిస్తున్నాను” అని వ్యాఖ్యానించారు.
అంతకుముందు ట్రంప్.. ఇరాన్, ఇజ్రాయెల్లను వెంటనే కాల్పులు ఆపాలని పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు ఇజ్రాయెల్పై ఇరాన్ క్షిపణి దాడులు చేయగా.. ప్రతిగా ఇజ్రాయెల్ ఇరాన్లోని పలు సైనిక లక్ష్యాలపై దాడులు చేసింది. దక్షిణ బీరూట్లో ఇరాన్ మద్దతు ఉన్న హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు చేసిన నేపథ్యంలోనే టెహ్రాన్ ప్రతీకార చర్యలకు దిగింది. లెబనాన్ రాజధానిని లక్ష్యంగా చేసుకుంటే ఇజ్రాయెల్పై నేరుగా దాడులు చేస్తామని ఇరాన్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించింది.
తాజా పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. యుద్ధం తిరిగి ముదిరే అవకాశాలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్ముజ్ జలసంధి మార్గంలో రవాణా అంతరాయాలు కొనసాగుతుండటంతో ఇంధనం, వస్తువుల సరఫరాపై ప్రభావం పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇరాన్ ప్రకటించిన కాల్పుల విరమణ ఎంతకాలం కొనసాగుతుంది? ఇజ్రాయెల్ స్పందన ఎలా ఉంటుంది? అన్నది ఇప్పుడు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.

