US-Iran War: తగ్గేది లేదంటున్న ఇరాన్.. మధ్యవర్తులు ఖతార్, పాక్‌లను వదలడం లేదు..

  • మధ్యవర్తి దేశాలపైనా ఇరాన్ దాడులు.
  • ఖతార్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులతో ఉద్రిక్తత.
  • సౌదీ-పాక్ రక్షణ ఒప్పందంతో పాకిస్తాన్‌పై ఒత్తిడి.
  • ఒమన్ మధ్యవర్తిత్వ పాత్ర బలహీనమవుతున్న సంకేతాలు.
Iran War

Iran War

US-Iran War: ఇరాన్ తన శత్రువులుగా భావిస్తున్న అమెరికా, ఇజ్రాయిల్‌లపై మాత్రమే కాకుండా, ఈ యుద్ధం ముగిసి శాంతి నెలకొల్పాలని భావిస్తున్న మధ్యవర్తి దేశాలపై కూడా దాడులు చేస్తోంది. దీంతో ఈ పరిణామం భవిష్యత్తులో ఇరాన్‌ను ఒంటరి చేసే ప్రమాదం ఏర్పడింది. ఖతార్, ఒమన్, పాకిస్తాన్‌లు ఇప్పుడు ఇరాన్ చర్యలకు మూల్యం చెల్లించుకుంటున్నాయి. ఖతార్‌పై ఇరాన్ క్షిపణుల్ని ప్రయోగిస్తోంది, సౌదీ విషయంలో పాకిస్తాన్‌కు సీరియస్ వార్నింగ్ ఇస్తోంది. ఇక ఇరాన్ మిత్రదేశంగా ఉన్న ఒమన్ పాత్ర కూడా బలహీనపడుతోంది.

ఖతార్‌పై దాడులు:

గల్ఫ్ దేశాల్లో ఖతార్‌కు చాలా ప్రాధాన్యత ఉంది. ఖతార్ ఇప్పటికే పలు అంతర్జాతీయ సమస్యల్లో మధ్యవర్తిత్వం చేసింది. ఆఫ్ఘాన్‌లో తాలిబాన్లతో ఒప్పందం, గాజా వార్ ముగియడంలో కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కూడా మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. అమెరికా అతిపెద్ద సైనిక స్థావరం అల్ ఉదైద్ ఖతార్‌లోనే ఉంది. మరోవైపు, ఇరాన్‌తో కూడా మిత్ర సంబంధాన్ని కలిగి ఉంది. అయితే, యుద్ధం ప్రారంభమైన తర్వాత ఖతార్ లక్ష్యంగా ఇరాన్ చాలాసార్లు క్షిపణులు, డ్రోన్లతో దాడులు చేసింది. ఎక్కువగా దాడికి గురైంది కూడా ఖతారే.

పాకిస్తాన్‌‌పై పెరుగుతున్న ఒత్తిడి:

మరోవైపు, మధ్యవర్తిగా తనను తాను చూపించుకుంటున్న పాకిస్తాన్ కూడా ఇరాన్ దాడుల తీవ్రతను ఎదుర్కొంటోంది. సౌదీ అరేబియా-పాకిస్తాన్ మధ్య రక్షణ ఒప్పందం ఉంది. ఈ ఒప్పందం ప్రకారం, సౌదీపై దాడి జరిగితే పాక్‌పై కూడా దాడి జరిగినట్లు భావించి, పాకిస్తాన్ యుద్ధంలోకి దిగుతుంది. అయితే, ఇరాన్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా సౌదీపై క్షిపణులతో దాడులు చేస్తోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఒత్తిడికి గురవుతోంది.

పాకిస్తాన్ ఇరాన్, సౌదీల మధ్య నలిగిపోతోంది. పాకిస్తాన్ గతంలో ఇరాన్‌కు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. పాకిస్తాన్-సౌదీ ఒప్పందాన్ని ఇరాన్ గుర్తుంచుకోవాలని ఆ దేశ మంత్రి ఇషాక్ దార్ గుర్తు చేశారు.

ఇరాన్ ఎందుకు ఇలా చేస్తోంది.?

తమపై సైనిక చర్యలకు దిగితే, యుద్ధం గల్ఫ్‌లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందనే సందేశాన్ని ఇరాన్ ఇవ్వాలనుకుంటోంది. దీంతో మిత్రుడు, శత్రువు అనే తేడా లేకుండా అన్ని దేశాలపై విరుచుకుపడుతోంది. అమెరికా మిత్రదేశాలైన యూఏఈ, కువైట్, ఖతార్, సౌదీ, బహ్రైయిన్‌లపై దాడులు చేసి, అమెరికాపై ఒత్తిడి తీసుకురావాలని చూస్తోంది. మరోవైపు హార్ముజ్‌పై హక్కులు తామే అని చాటి చెప్పేందుకు ఈ మార్గంలో నౌకా రవాణాను అడ్డుకుంటోంది. ఇరాన్ తీసుకుంటున్న నిర్ణయాలు యుద్ధాన్ని మరింతగా పెంచేలా చేస్తున్నాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. మధ్యవర్తులు, మిత్రదేశాలపై దాడులు కూడా ఇరాన్ దౌత్య మార్గాలను మూసేస్తాయని హెచ్చరిస్తున్నారు.