పశ్చిమాసియా యుద్ధం మరింత ముదురుతున్నట్లుగా కనిపిస్తోంది. గత 28 రోజులుగా జరుగుతున్న యుద్ధం తీవ్రం అవుతోంది. ట్రంప్ చర్చలకు పిలుస్తున్నా.. ఇరాన్ మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అమెరితో ఎలాంటి చర్చలు లేవని తేల్చి చెబుతోంది. అంతేకాకుండా తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశాలకు హార్ముజ్ను మూసేస్తున్నట్లు ఇరాన్ ఐఆర్జీసీ ప్రకటించింది. శత్రువులతో కలిసుండే దేశాలకు ఏ మాత్రం అనుమతి ఇవ్వబోమని పేర్కొంది. ఇప్పటికే ఆయా దేశాలకు చెందిన మూడు నౌకలను కూడా వెనక్కి పంపేసినట్లు వెల్లడించింది. ఇక అమెరికా బలగాలు ఉన్న ప్రాంతంలోని పౌరులు దూరంగా వెళ్లిపోవాలని ఇరాన్ హెచ్చరించింది.
ఇరాన్ చేసిన తాజా హెచ్చరికలు మరింత ఉద్రిక్తతలకు దారి తీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నెల రోజులుగా జరుగుతున్న యుద్ధంతో ప్రపంచ దేశాల్లో చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. కోట్లాది మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు ఇరాన్ సిద్ధపడుతోంది.
హార్ముజ్ జలసంధిని తెరవకపోతే విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇక ఇరాన్ ప్రాధేయపడడంతోనే చర్చల కోసం ఐదు రోజులు దాడులు ఆపేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. తాజాగా ఆ గడువు కూడా ఏప్రిల్ 6 వరకు పెంచారు. కానీ ట్రంప్ ప్రకటనకు వ్యతిరేకంగా ఇరాన్ స్పందిస్తోంది. అమెరికాతో ఎలాంటి చర్చలు లేవని.. అమెరికా భూతల దాడులు చేస్తే.. తాము కూడా గల్ఫ్ దేశాలపై దాడి చేస్తామని ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది. ఈ పరిణామాలు ఎటువైపు దారి తీస్తాయోనని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత నెల 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక అధికారులంతా హతమయ్యారు. అంతేకాకుండా అనంతరం దాడుల్లో ఇరాన్లో కీలక నేతలంతా ఒక్కొక్కరిగా హతమయ్యారు. ఈ నేపథ్యంలో ఇరాన్ ప్రతీకార దాడులతో చెలరేగిపోతుంది. గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేస్తోంది. ఈ కారణంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి.