Site icon NTV Telugu

Trump-Modi: భారత్‌కు ట్రంప్ గుడ్‌న్యూస్.. జరిమానా సుంకం ఎత్తివేత

Modi

Modi

భారత్-అమెరికా మధ్య సంబంధాలు రోజురోజుకు బలపడుతున్నాయి. గత వారం భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం కార్యరూపం దాల్చుతోంది. రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంపై తాత్కాలిక ముసాయిదాను అమెరికా విడుదల చేసింది. ఇక రష్యా దగ్గర చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై విధించిన 25 శాతం జరిమానా సుంకాన్ని ట్రంప్ ఎత్తేశారు. జరిమానాను పూర్తిగా ఎత్తేసినట్లుగా అమెరికా ప్రకటించింది. ఇక భారత్ వస్తువులపై సుంకాలను 18 శాతానికి తగ్గిస్తున్నట్లుగా అమెరికా అంగీకరించింది. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేశారు. ఇక అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులపై భారతదేశం సుంకాలను తగ్గిస్తుందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు.

పీయూష్ గోయల్ ఎక్స్ పోస్ట్..
భారత్-అమెరికా ఒప్పందంతో భారతీయ చిన్న, మధ్య తరహా సంస్థలు, రైతులు, మత్స్యకారులకు ముప్పై ట్రిలియన్ డాలర్ల భారీ మార్కెట్‌కు దారి తీస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ఎక్స్‌లో చెప్పారు. మహిళలు, యువతకు లక్షలాది ఉపాధి అవకాశాలను లభిస్తాయన్నారు. అమెరికా సుంకాలను 18 శాతానికి తగ్గించడం వల్ల వస్త్రాలు, తోలు, ప్లాస్టిక్ వంటి రంగాల్లో అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Jogi Ramesh: జోగి రమేష్‌కు హైకోర్టులో ఊరట

జెనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన విభాగాలు వంటి అనేక వస్తువులపై సుంకాలు సున్నాకి తగ్గించబడతాయని.. దీని ద్వారా ‘‘మేక్ ఇన్ ఇండియా’’ను మరింత బలపరుస్తుందని కేంద్రమంత్రి అన్నారు. తాజా ఒప్పందంతో రైతుల ప్రయోజనాలను పరిరక్షిస్తుందని చెప్పారు. గ్రామీణ జీవనోపాధిని నిలబెడుతుందన్నారు. మొక్క జొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, చీజ్, ఇథనాలు, పొగాకు, కొన్ని కూరగాయాలు, మాంసం మొదలైన సున్నితమైన వ్యవసాయ, పాల ఉత్పత్తులను పూర్తి రక్షణ కలిగిస్తుందని వివరించారు. ఈ ఒప్పందం భారత్-అమెరికా ఆర్థిక సహాకారాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుందని పీయూష్ గోయల్ ఎక్స్‌లో పేర్కొన్నారు.

 

 

Exit mobile version