Iran-Israel War: భారత్ అప్రమత్తం.. పౌరులు జాగ్రత్తగా ఉండాలని సూచన

  • పశ్చిమాసియా ఉద్రిక్తతలపై భారత్ అప్రమత్తం
  • పౌరులు జాగ్రత్తగా ఉండాలని ఎంబసీ సూచన
  • ఇరాన్‌పై ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ప్రారంభించిన ఇజ్రాయెల్
Iran

Iran

పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్ ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌ ప్రారంభించింది. ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌లోని భారతీయ రాయబార కార్యాలయం అప్రమత్తం అయింది. భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. భారతీయ ఎంబసీతో టచ్‌లో ఉండాలని తెలిపింది. ఇక పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇరాక్ ప్రాంతాల్లో విమాన షెడ్యూల్‌లో మార్పులు ఉంటాయని ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం తెలిపింది.

ఇది కూడా చదవండి: Ahmedabad Plane Crash: ఆలస్యం, ప్రయాణ వాయిదా.. విమాన ప్రమాదం నుంచి తప్పించుకున్న ఇద్దరు!

శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేసింది. వైమానిక దాడుల్లో ఇరాన్ అణు స్థావరాలు ధ్వంసమయ్యాయి. పక్కా ప్రణాళికతో ఈ దాడులు చేసినట్లుగా కనిపిస్తోంది. ఇక దాడుల్లో ఇరాన్‌లో అత్యంత శక్తివంతమైన రివల్యూషనరీ గార్డ్స్ చీఫ్ హుస్సేన్ సలామి మరణించారు. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో హుస్సేన్ సలామి అమరుడయ్యాడని స్థానిక మీడియా పేర్కొంది. అలాగే ఐఆర్‌జీసీ హెడ్‌క్వార్టర్స్‌పై ఇజ్రాయెల్‌ జరిపిన దాడుల్లో మేజర్‌ జనరల్‌ హుస్సేన్ సలామితో పాటు రెవల్యూషనరీ గార్డ్‌లోని ఇతర ముఖ్య అధికారులు, ఇద్దరు అణు శాస్త్రవేత్తలు కూడా మరణించినట్లు సమాచారం. ఈ మేరకు ఇరాన్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Netanyahu: ఇరాన్‌పై ‘ఆపరేషన్‌ రైజింగ్‌ లయన్‌’ ప్రారంభించాం.. ఇజ్రాయెల్ ప్రధాని వెల్లడి

ఇజ్రాయెల్ దాడులతో ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరాన్ కూడా ప్రతీకార దాడులకు సిద్ధపడుతోంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడులు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా అప్రమత్తం అయింది. దేశమంతా ఎమర్జెన్సీ ప్రకటించింది. దేశ పౌరులంతా అప్రమత్తంగా ఉండాలని ఇజ్రాయెల్ రక్షణ శాఖ హెచ్చరించింది.