Imran Khan: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోసం ఆ దేశంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతున్నాయి. ఇమ్రాన్ కంటిచూపు కోల్పోయినట్లు నివేదిక వెలువడటంతో బుధవారం దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. పంజాబ్, ఖైబర్ ఫఖ్తుంఖ్వాలను కలిపే కీలక మార్గాలను అడ్డుకున్నారు. ఇస్లామాబాద్ పార్లమెంట్ సమీపంలో ఆయన మద్దతుదారులు ధర్నా నిర్వహించారు. ఇదిలా ఉంటే, ఇమ్రాన్ ఖాన్ను రావల్పిండి అడియాలా జైలులో తీవ్రంగా హింసించారని, అంతర్గత మంత్రి, పీసీబీ చీఫ్ అయిన మోహ్సీన్ నఖ్వీ తమను బెదిరిస్తున్నారని ఆయన సోదరీమణులు ఆరోపించారు.
Read Also: Punjab Video: పెళ్లిలో షాకింగ్ ఘటన.. వధువుపై రూ.8.5 కోట్ల కరెన్సీ వర్షం
సుప్రీంకోర్టు నియమించిన న్యాయవాది తన నివేదికలో ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు 85 శాతం కోల్పోయినట్లు నివేదికలో వెల్లడించడంతో పాకిస్తాన్లోని ఆయన పార్టీ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ కార్యకర్తలతో పాటు ఆయన మద్దతుదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసిమ్ మునీర్, మోహ్సీన్ నఖ్వీలు ఇమ్రాన్ ఖాన్ను కస్టడీలో చంపడానికి ప్లాన్ చేశారని ఇమ్రాన్ సిస్టర్స్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్కు మాకు ఏదైనా జరిగితే దానికి మోహ్సీన్ నఖ్వీనే కారణమని అన్నారు. ఆసిమ్ మునీర్ ఆదేశాల మేరకే ఇమ్రాన్ ఖాన్పై జైలులో క్రూరంగా ప్రవర్తించినట్లు వారు ఆరోపించారు.
మరోవైపు, ఇమ్రాన్ మద్దతుదారులు ‘‘కంటికి కన్ను’’ అంటూ పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇమ్రాన్ ఖాన్కు వైద్యం అందిస్తున్న డాక్టర్లు ఇప్పుడు ఆయన పరిస్థితి మెరుగైందని చెప్పారు. గతంలో గడియారాన్ని కూడా చూడలేని ఇమ్రాన్ ఇప్పుడు, అందులో ముళ్లను కూడా చూడగలుగుతున్నారని అన్నారు.
