Hamas: హమాస్‌కు కొత్త బాస్.. ఖలీల్ అల్-హయ్యా చేతుల్లోకి పగ్గాలు!

Hamas

Hamas

Hamas: తీవ్రవాద సంస్థ హమాస్‌కు కొత్త నాయకుడు ఎన్నికయ్యారు. ఖలీల్ అల్ – హయ్యాను తమ అధిపతిగా ఎన్నుకున్నట్లు హమాస్ ప్రకటించింది. గతంలో గాజాలోని హమాస్ రాజకీయ విభాగానికి నాయకత్వం వహించిన అల్-హయ్యా.. ఇప్పుడు సంస్థకు అత్యున్నత స్థాయి నాయకుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై జరిగిన హమాస్ దాడి అనంతరం ప్రారంభమైన యుద్ధంలో కాల్పుల విరమణ, బందీల విడుదలకు సంబంధించిన చర్చల్లో ఖలీల్ అల్-హయ్యా కీలక పాత్ర పోషించారు. హమాస్ ప్రధాన సంధానకర్తగా కూడా ఆయన వ్యవహరించారు. హమాస్ మాజీ నాయకులు యహ్యా సిన్వార్, ఇస్మాయిల్ హనియే మరణాల తర్వాత గత రెండేళ్లుగా ఐదుగురు సభ్యులతో కూడిన నాయకత్వ మండలి సంస్థను నడిపించింది. తాజాగా జరిగిన అంతర్గత ఎన్నికల్లో అల్-హయ్యా కొత్త నాయకుడిగా ఎంపికయ్యారు.

గాజా స్ట్రిప్‌లో జన్మించిన ఖలీల్ అల్-హయ్యా తన జీవితంలో ఎక్కువ భాగాన్ని అక్కడే గడిపారు. 2023 అక్టోబర్ దాడులకు కొద్దికాలం ముందు గాజా నుంచి ఖతార్‌కు వెళ్లిన ఆయన అప్పటి నుంచి అక్కడి నుంచే కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. ఖతార్‌లో ఉంటూ అల్-హయ్యా అరబ్ దేశాల రాజకీయ నాయకులతో సంబంధాలు కొనసాగించారు. 2024లో హమాస్ మాజీ నేత ఇస్మాయిల్ హనియే టెహ్రాన్ పర్యటన సమయంలో ఆయనతో పాటు ఉన్నారు. అదే పర్యటనలో హనియే హత్యకు గురయ్యారు. అక్టోబర్ 7 దాడి లక్ష్యం ఇజ్రాయెల్ సైనికులను పట్టుకుని, జైళ్లలో ఉన్న పాలస్తీనా ఖైదీల విడుదల కోసం ఒత్తిడి తీసుకురావడమేనని అల్-హయ్యా గతంలో పేర్కొన్నారు. ఆ దాడిని ఆయన సమర్థిస్తూ, పాలస్తీనా అంశాన్ని అంతర్జాతీయ చర్చల్లోకి తిరిగి తీసుకురావడంలో అది కీలకంగా మారిందని వ్యాఖ్యానించారు.

ఖలీల్ అల్-హయ్యా కఠిన వైఖరిని కలిగిన నాయకుడిగా చెబుతారు. ఇజ్రాయెల్‌తో వివాదంలో స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటే తన ప్రధాన లక్ష్యమని ఆయన పలుమార్లు వెల్లడించారు. గాజా ఇస్లామిక్ యూనివర్సిటీ నుంచి పట్టా పొందిన ఆయన, జోర్డాన్ విశ్వవిద్యాలయం నుంచి ఉన్నత విద్యను అభ్యసించారు. 1987లో హమాస్ స్థాపన నుంచి ఆ సంస్థతో అనుబంధం కొనసాగిస్తున్న అల్-హయ్యా.. 2006 నుంచి పాలస్తీనా శాసన మండలి సభ్యుడిగా కూడా ఉన్నారు. ఇజ్రాయెల్ దాడుల్లో తన కుటుంబ సభ్యులను కోల్పోయినప్పటికీ, హమాస్ రాజకీయ, సైనిక వ్యూహాల్లో కీలక పాత్ర పోషిస్తూ వచ్చారు. ఖలీల్ అల్-హయ్యా నాయకత్వంలో హమాస్ భవిష్యత్ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.