The Earth: భూమి తన అక్షంపై తిరగడం వల్లే రాత్రి, పగలు ఏర్పడుతాయని మనం స్కూల్లో చదువుకున్నాం. అయితే, మానవుడి అత్యాశ భూమి అక్షాన్నే మార్చేలా చేసింది. భూమి నుంచి యథేచ్చగా భూగర్భ జలాలను వాడిన ఫలితంగా భూమి భ్రమణ అక్షం 31.5 అంగుళాలు ( దాదాపు 80 సెంటీమీటర్లు) పక్కకు వంగింది. ఈ మార్పు 1993-2010 మధ్య ఇది సంభవించింది. నిజానికి ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు. కానీ, అంతరిక్షంలో చిన్న మార్పు కూడా పెద్ద ప్రమాదాలకు కారణమవుతుంది.
సియోల్ నేషనల్ యూనివర్శిటీకి చెందిన భూభౌతిక శాస్త్రవేత్త కీ-వియోన్ సియో,అతని బృందం ఈ సంచలనాత్మక విషయాన్ని కనుగొన్నారు. ఇది జియో ఫిజికల్ రీసెర్చ్ లెటర్స్లో ప్రచురితమైంది. 2026లో ప్రచురించబడిని జర్నల్ ఆఫ్ డియోడెసీ అండ్ నేచర్ వంటి ఇతర అధ్యయనాలు కూడా భూమి తన అక్షం నుంచి వంగినట్లు చెప్పాయి. దీనికి సముద్ర మట్టాలు పెరగడం వల్ల ఈ మార్పులు చోటుచేసుకున్నట్లు తెలిపాయి.
1990 నుంచి 2010 మధ్య ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయం, పారిశ్రామిక అవసరాలు, తాగునీటి కోసం భూగర్భ జలాలను విస్తారంగా ఉపయోగించారు. ఈ కాలంలో సుమారు 2150 గిగాటన్నుల (2.15 ట్రిలియన్ టన్నులు) నీటిని భూగర్భం నుంచి బయటకు తీసినట్లు శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
భూమి ఎలా వంగింది.?
భూమిపై ఉన్న సముద్రాలు, పర్వాతాలు, హిమనీనదాలు, వందల కోట్ల టన్నుల వీటన్నింటిని భూమి బరువులో భాగంగానే గుర్తిస్తారు. భూమిని ఒక బొంగరంగా భావిస్తే, భూమిపై ఉన్న బరువులు దానిని బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఒక బొంగరాన్ని తిప్పితే అది సమతుల్యంగా తిరుగుతుంది. కానీ దానికి అదనంగా ఒక బరువును చేర్చితే అది తూలడం ప్రారంభిస్తుంది. ఇప్పుడు భారీ స్థాయిలో భూగర్భ జాలాలు తోడేయడం వల్ల భూమి బరువు పంపిణీ మారిపోయింది. ఈ మార్పు భూమి అక్షాన్ని ప్రభావితం చేసిందని పరిశోధకులు చెబుతున్నారు.
పెరిగిన సముద్రమట్టాలు..
భూమి నుంచి నీటిని తీసిన తర్వాత, ఇది చివరకు కాలువలు, నదులు, వాగుల ద్వారా సముద్రాల్లో కలుస్తోంది. దీని వల్ల సముద్ర మట్టాలు కూడా పెరుగుతున్నాయి. భూగర్భ జలాల వినియోగం వల్ల ప్రపంచ సముద్ర మట్టాలు సుమారుగా 6.24 మిల్లీమీటర్లు పెరిగాయి. ఇది దీర్ఘకాలంలో వాతావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది.
సింహభాగం భారత్, అమెరికాలే:
భూమి భ్రమణంలో నీటిని తొలగించడం వల్ల ఏ భాగం ఎక్కువగా ప్రభావితమవుతుందో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నించినప్పుడు, వారు ఒక ఆశ్చర్యకరమైన భౌగోళిక వాస్తవాన్ని కనుగొన్నారు. భూమి కేంద్రమైన భూమధ్య రేఖ నుంచి నీటిని బదిలీ చేయడం వల్ల ధ్రువాల భ్రమణంపై ప్రభావాన్ని చూపిస్తుంది. పశ్చిమ ఉత్తర అమెరికా, వాయువ్య భారత్లో నీటిపారుదల, వ్యవసాయం కోసం భారీగా భూగర్భ జలాలను తోడటమే అక్షం మారడానికి కారణమని తేలింది. భారత్లోని పంజాబ్, హర్యానా, ఉత్తర్ ప్రదేశ్ వంటి ప్రాంతాల్లో వరి పండించడం కోసం నీటిని ఎక్కువగా తోడారు.
కుంగిపోతున్న భూమి..
భూగర్భ జలాల వల్ల కేవలం భూమి అక్షమే కాదు, భూమి కుంగిపోవడం కూడా జరుగుతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. సముద్ర మట్టాలు పెరగడం, తీర ప్రాంతాల్లు ఉప్పు నీరు చొరబాటు సమస్యలు కూడా పెరుగుతున్నట్లు తేలింది. ప్రపంచంలో 40 ప్రధాన నదీ డెల్టాలపై నిర్వహించిన అధ్యయనం ప్రకారం 10 డెల్టాల్లో భూమి కుంగిపోయినట్లు తేలింది.
పరిష్కారం ఉంది..
సరైన విధానాలు పాటిస్తే ఈ పరిస్థితిని రివర్స్ చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూగర్భ జలాలకు బదులుగా ప్రత్యామ్నాయ నీటి వనరుల్ని ఉపయోగించడం, వర్షపు నీటిని సంరక్షించడం, భూగర్భ జలాల రీఛార్జ్, నీటి వినియోగంపై కఠిన చట్టాలు తీసుకురావడం వంటిని చేయాలి.

