US-EU Trade War: ప్రపంచ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర టారిఫ్ లు విధించారు. ఐరోపా దేశాల నుంచి దిగుమతి చేసుకునే ఉక్కు- అల్యూమినియంపై సుమారు 25 శాతం సుంకం విధించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై యూరోపియన్ యూనియన్ దేశాలు కీలక సమావేశం ఏర్పాటు చేశాయి. చర్చల అనంతరం యూఎస్ వస్తువులపై 23 బిలియన్ డాలర్ల విలువైన ప్రతీకార సుంకాలను విధించడానికి ఆమోదం తెలిపాయి. 27 దేశాలు ఈ తీర్మానానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ సుంకాలు ఏప్రిల్ 15, మే 15, డిసెంబర్ 1 నుంచి దశల వారీగా అమల్లోకి వస్తాయని వెల్లడించారు. అయితే, ఎలాంటి అమెరికా ఉత్పత్తులపై సుంకాలు విధిస్తారు అనేది మాత్రం బయటకు చెప్పలేదు.
Read Also: Tirumala: మూడు రోజులు పాటు శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు!
అయితే, వాణిజ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా ఉండటానికి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఐరోపా దేశాలకు చెందిన ఆర్థిక నిపుణులు పేర్కొన్నారు. ఇక, అమెరికా సుంకాలను అన్యాయమైనవిగా ఐరోపా దేశాలు ఆరోపించాయి. దీనివల్ల రెండు వైపులా ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని చెప్పుకొచ్చారు. అలాగే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది అని ఈయూ కార్యనిర్వాహక కమిషన్ ఒక ప్రకటనలో తెలిపింది.