ప్రపంచ వ్యాప్తంగా ‘ఎక్స్’ ట్విట్టర్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సోమవారం నుంచి ఆటంకం ఏర్పడింది. దీంతో సోషల్ మీడియా ప్రియులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 40 వేల మందికిపైగా ఫిర్యాదులు వెళ్లాయి. ఇదిలా ఉంటే మంగళవారం కూడా అదే అంతరాయం కొనసాగుతోంది. దీంతో వందలాది మంది ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం పదే పదే క్రాష్ అవుతోంది.
తాజాగా అంతరాయంపై ‘ఎక్స్’ యాజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు. ఎక్స్పై సైబర్ దాడి జరిగిందని.. దీనికి ఉక్రెయినే కారణమని తీవ్ర సంచలన ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్కు సంబంధించిన ఐపీ అడ్రస్లు కనుగొన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతం నుంచే ఈ సైబర్ దాడి జరిగినట్లుగా గుర్తించినట్లు చెప్పారు.
అయితే ఈ సైబర్ దాడికి పాలస్తీనా అనుకూల హ్యాకర్ గ్రూప్ బాధ్యత వహించింది. పాలస్తీనా అనుకూల సంస్థ డార్క్ స్టార్మ్ టీం బాధ్యత వహించింది. పాలస్తీనా అనుకూల గ్రూప్ బాధ్యత వహించినప్పటికీ.. దీనికి మూలం మాత్రం ఉక్రెయినే కారణంగా ప్రశ్నలు తలెత్తుతున్నాయని మస్క్ పేర్కొన్నారు.
‘‘ఏం జరిగిందో కచ్చితంగా తెలియదు గానీ.. ఉక్రెయిన్ ప్రాంతానికి సంబంధించిన ఐపీ చిరునామాలతో ఎక్స్ వ్యవస్థను కూల్చేసేందుకు భారీ సైబర్ దాడి జరిగింది.’’ అని మస్క్ ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Nizamabad: నిజామాబాద్లోని మార్కెట్ యార్డుకు పోటెత్తిన పసుపు..
ఇదిలా ఉంటే గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అయితే ఇజ్రాయెల్కు మద్దతు తెలిపే దేశాలపై పాలస్తీనా అనుకూల హ్యాకర్ గ్రూప్ డార్క్ స్టార్మ్ టీమ్ దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో భాగంగానే ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తున్న అమెరికాను ఈ హ్యాకర్ గ్రూప్ టార్గెట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. కానీ మస్క్ మాత్రం.. ఉక్రెయిన్పై ఆరోపణలు గుప్పిస్తున్నారు.
ఇటీవల వైట్హౌస్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గొడవ పెట్టుకున్నారు. మీడియా వేదికగా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్యుద్ధం నడిచింది. అనంతరం జెలెన్స్కీకి ఐరోపా దేశాలు మద్దతుగా నిలిచాయి. ఈ నేపథ్యంలోనే ఉక్రెయిన్పై మస్క్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం భద్రతా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎక్స్ వ్యవస్థ దెబ్బతినడానికి కారణాలను అన్వేషిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Vikram : విక్రమ్ సినిమా తెలుగు స్టేట్స్ మంచి ధర పలికింది