China On Iran War: ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. గత శనివారం ఇజ్రాయిల్, యూఎస్ దళాలు ఇరాన్ రాజధాని టెహ్రాన్తో పాటు ఇతర నగరాలపై వైమానిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఆ దేశ సుప్రీం లీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ మరణించారు. అప్పటి నుంచి ఇరు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరింది. మరోవైపు, ఇరాన్ ఇజ్రాయిల్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలైన కువైట్, బహ్రైయిన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలపై దాడులు చేస్తోంది. ఈ దేశాల్లోని అమెరికా స్థావరాలపై విరుచుకుపడుతోంది.
మరోవైపు, ట్రంప్, నెతన్యాహూలు ఇరాన్లో ‘‘పాలన మార్పు’’ కావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాకు చైనా నుంచి స్ట్రాంగ్ హెచ్చరిక వచ్చింది. సైనిక చర్యకు బదులుగా దౌత్యపరమైన జోక్యాన్ని స్వీకరించాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ అంతర్జాతీయ సమాజానికి ఆదివారం విజ్ఞప్తి చేశారు. ఇరాన్, మధ్యప్రాచ్యానికి సంబంధించిన సమస్యల్ని సరిగా నిర్వహించాలని అన్నారు. ఇరాన్, గల్ఫ్ దేశాల సార్వభౌమాధికారం, భద్రతను అన్ని పరిస్థితుల్లో గౌరవించాలని కోరారు. వీలైనంత త్వరగా చర్చలకు రావాలని ఇరు వర్గాలకు సూచించారు.
Read Also: Suryakumar Yadav: ప్రత్యర్థి కెప్టెన్స్ అందరూ అదే డైలాగా.. ఏదైనా కొత్తగా ప్రయత్నించండి!
“విప్లవం లేదా పాలన మార్పుకు కుట్ర పన్నే ప్రయత్నాలకు ప్రజల మద్దతు లేదు” అని విదేశాంగ మంత్రి అన్నారు. ఈ సంక్షోభాన్ని పరిష్కరించడంలో సహాయం చేయాలని చైనా ప్రధాన దేశాలకు సూచించింది. శాంతి కోసం భవిష్యత్తులో చైనా తన ప్రయత్నాలను ముమ్మరం చేయడానికి సిద్ధంగా ఉందని విదేశాంగ మంత్రి చెప్పారు. ప్రాంతీయ భద్రతకు చైనా ఎల్లప్పుడూ ఒక వంతెనగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మరోవైపు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా వచ్చే అవకాశం ఉందని చెప్పారు. చైనా మరియు అమెరికా మధ్య సంభాషణ లేకపోవడం వల్ల అపార్థాలు, మరిన్ని ఘర్షణలు మాత్రమే వస్తాయని ఆయన నొక్కి చెప్పారు. రెండు దేశాల దేశాధినేతలు మంచి సంభాషణను కొనసాగించడానికి కృషి చేశారని, ఈ సంవత్సరం చైనా-అమెరికా సంబంధాలకు ముఖ్యమైన సంవత్సరంగా ఆయన అభివర్ణించారు. రెండు వైపులా అడ్డంకులు తొలగాల్సిన అవసరం ఉందని వాంగ్ యి అన్నారు.