NTV Telugu Site icon

India-Bangladesh: భారత్-బంగ్లాదేశ్ మధ్య బస్సు సర్వీసులు పునఃప్రారంభం

Bus

Bus

భార‌త్‌-బంగ్లాదేశ్‌ల మ‌ధ్య బ‌స్సు స‌ర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. క‌రోనా నేప‌థ్యంలో రెండేళ్ల క్రితం ఇరు దేశాల మ‌ధ్య ఈ బ‌స్సు స‌ర్వీసుల‌ను నిలిపేసిన విష‌యం తెలిసిందే. త్రిపుర రాజధాని అగర్తల నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా మీదుగా కోల్‌కతాకు వచ్చే బస్సు సర్వీసును పునరుద్ధరించారు. క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్టడంతో ఈ స‌ర్వీసుల‌ను ఇవాళ మళ్లీ ప్రారంభించారు. అగ‌ర్తలా ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-ఆఖావ్డా, హ‌రిదాస్‌పూర్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్-బేనాపూల్ మ‌ధ్య ఈ బ‌స్సు స‌ర్వీసులు అందుబాటులో ఉంటాయని బంగ్లాదేశ్‌లోని భార‌త హై క‌మిష‌న్ ట్విటర్ ద్వారా వెల్లడించింది.

ఢాకా-కోల్‌క‌తా-ఢాక్ బ‌స్సు స‌ర్వీసు కూడా శుక్రవారం ఉద‌యం నుంచి ప్రారంభ‌మైంద‌ని వివ‌రించింది. భార‌త్‌-బంగ్లాదేశ్ మ‌ధ్య మే 29 నుంచి రైలు స‌ర్వీసు కూడా ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. ఇరు దేశాల మ‌ధ్య రైలు స‌ర్వీసులు క‌రోనా కార‌ణంగా 2020 మార్చి నుంచి నిలిచిపోయాయి. బంధ‌న్ ఎక్స్‌ప్రెస్ కోల్‌క‌తా-ఖుల్నా మ‌ధ్య, మైత్రీ ఎక్స్‌ప్రెస్ కోల్‌క‌తా-ఢాక్ మ‌ధ్య స‌ర్వీసులు కొన‌సాగనున్నాయి. బ‌స్సు, రైలు స‌ర్వీసులు పునఃప్రారంభ‌మైన నేప‌థ్యంలో ముఖ్యంగా చిరు వ్యాపారుల‌కు ల‌బ్ధి చేకూర‌నుంది. వాస్తవానికి బస్సు సర్వీసును ఏప్రిల్ 28న పునఃప్రారంభించాల్సి ఉండగా కొన్ని సాంకేతిక సమస్యల కారణంగా జూన్ 10వరకు వాయిదా పడింది.