Tirupati dead bodies: తిరుపతి జిల్లా పాకాల- చంద్రగిరి మూలకోన అటవీ ప్రాంతంలో బయటపడిన మృతదేహాలపై మిస్టరీ ఇంకా వీడలేదు. నాలుగు మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేసిన పోలీసులు.. అవి హత్యలా లేక ఆత్మహత్యలా అన్నది తేల్చని పరిస్థితి ఉంది. అయితే మృతులకు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. చనిపోయిన సెల్వన్, జయమాలిని అన్నా చెల్లెలుగా పోలీసులు గుర్తించారు. అంతే కాదు పెద్ద ఎత్తున ఫైనాన్స్ వ్యాపారం చేసినట్టు చెబుతున్నారు. ఆ కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు.
READ ALSO: Disco Dancer : ఇండియాలో తొలి వంద కోట్ల సినిమా ఏదో తెలుసా..?
మృతులను తమిళనాడుకు చెందిన కలై సెల్వన్, ఆయన సోదరి జయమాలినిగా గుర్తించారు. అదే ప్రాంతంలో పూడ్చి పెట్టిన చిన్నారుల మృతదేహాలను జయమాలిని కూతుళ్లు వర్షిణి, హర్షిణిగా గుర్తించారు. ఈ మిస్టరీ డెత్స్పై తిరుపతి జిల్లా పోలీసులు… తంజావూర్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఐతే గత జులైలో జయమాలిని, ఇద్దరు పిల్లలు కనిపించడం లేదని తమిళనాడు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. జయమాలిని భర్త వెంకటేశన్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కానీ జయమాలిని, ఆమె సోదరుడు కలై సెల్వన్ ఇప్పుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వారి నోటిలో గుడ్డలు, గ్లౌజులు కుక్కి, ప్లాస్టర్ వేసి చంపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఐతే కలై సెల్వన్ డెడ్ బాడీ చెట్టుకు ఉరి వేసినట్లుగా వేలాడ దీసి ఉంది. దీంతో అసలు ఏం జరిగిందనేది పోలీసులు ఓ నిర్ధారణకు రాలేకపోతున్నారు.
మరోవైపు కువైట్లో పని చేస్తున్న జయమాలిని భర్త వెంకటేశన్.. జులైలో ఇంటికి వచ్చినప్పుడు భార్య, పిల్లలు కనిపించకపోవడంతో అనుమానంతో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక సీడీఆర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు కేసులో పురోగతి సాధించింది భర్తను అదుపులోకి తీసుకున్నారు.. అయితే ఇప్పటికీ వారు ఎలా మృతి చెందారనే విషయంపై మిస్టరీ వీడటం లేదు. ఎవరైనా హత్య చేశారా లేక ఆత్మహత్య పాల్పడ్డారా? అన్నది తెలియడం లేదు. జయమాలిని భర్త వెంకటేష్ను విచారణ అనంతరం పోలీసులు పంపేశారు. ఆమెకు ముగ్గురు సోదరులు, ఓ సోదరి ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు వారికి సైతం ఫోన్ ద్వారా సమాచారమిచ్చారు. ఐతే ఎవరూ పట్టించుకోలేదని తెలుస్తోంది. మృతుల్లో చిన్నపిల్లల శరీరాలపై మాత్రమే గాయాలున్నట్లు గుర్తించారు. జయమాలిని ఒంటిపై గాయాలేవీ లేవు. ఆమె మెడ ఎముక ఉన్న తీరును బట్టి ఉరి ద్వారా మృతి చెందాక కిందకు దింపినట్లు భావిస్తున్నారు…
మరోవైపు కలై సెల్వన్ రాత్రిళ్లు సరిగా నిద్రపోయే వాడు కాదని, మానసిక వైద్యశాలలో చికిత్స తీసుకునేవాడని బంధువుల ద్వారా తెలుస్తోంది. అత్యధిక సమయం యూట్యూబ్లో నేరాలకు సంబంధించిన వీడియోలు చూసేవాడని సమాచారం. ఇక అన్నా చెల్లెలుగా ఉన్న ఇద్దరు కూడా ఒక ఇంట్లో ఉండేవారని తెలిపారు. ఇద్దరు కూడా కోటి రూపాయలకు పైగా ఫైనాన్స్ చేస్తున్నట్లు స్థానికల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. చాలా రోజుల పాటు ఫైనాన్స్ వ్యాపారం బాగానే సాగినా అటు తర్వాత రికవరీ ఆశించినంత స్థాయిలో కాకపోవడంతోనే తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురైనట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి తోడు ఉన్న కాస్త డబ్బులను జల్సాలకు ఖర్చు పెట్టడంతో భర్తకు ఏం సమాధానం చెప్పాలో తెలియక జయమాలిని పలుమార్లు ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పుకొని బాధపడినట్లుగా తెలుస్తోంది. ఆ కారణంతో ఏమైనా ఇద్దరు పిల్లల్ని చంపివేసి అటు తర్వాత ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి…
అయితే ఇవన్నీ రెండు మూడు రకాల వెర్షన్లు గానే ఉన్నప్పటికీ అసలు నిజం ఏంటన్నది మాత్రం ఇప్పటికీ బయటకు రావడం లేదు. ఇక మృతదేహాల వద్ద దొరికిన రెండు సెల్ ఫోన్ లతో పాటు మృతురాలి భర్త వెంకటేష్ సెల్ నంబరును పోలీసులు తీసుకున్నారు. వీటికి సంబంధించి కాల్ డేటా విశ్లేషిస్తే ఏవైనా ఆధారాలు లభిస్తాయని పోలీసులు ఆ దిశగా కసరత్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నివేదిక వచ్చాకే ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు…
READ ALSO: Hyderabad Scam: రూ.600 కోట్ల స్కామ్.. గేటెడ్ కమ్యూనిటీనే టార్గెట్ చేసిన కిలాడీ లేడీ!