Telangana Cyber Crime : తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణ కోసం పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో వేల సంఖ్యలో అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, కోట్ల రూపాయల సైబర్ మోసాలకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
తెలంగాణలో తొలిసారిగా ఒకేసారి నిర్వహించిన ఈ సమన్వయ ఆపరేషన్లో మొత్తం 137 పోలీసు బృందాలు పాల్గొన్నాయి. 512 మంది పోలీసు సిబ్బందితో కూడిన ఈ బృందాలు రాష్ట్రవ్యాప్తంగా గుర్తించిన 137 బ్యాంకు శాఖల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా నమోదైన 9,451 సైబర్ నేరాల కేసులతో సంబంధం ఉన్నట్లు అనుమానించిన 1,888 మ్యూల్ బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించారు. ఈ మోసాల ద్వారా సుమారు రూ.100 కోట్లకు పైగా నష్టం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఆపరేషన్ ఫలితంగా మొత్తం 549 ఎఫ్ఐఆర్లు నమోదు చేయగా, 626 మంది అనుమానితులను గుర్తించారు. వీరిలో 208 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్టైన వారిలో 15 మంది మహిళలు ఉండగా, 7 మంది విద్యార్థులు, ఇద్దరు లెక్చరర్లు, ఒకరు విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఎక్కువ మంది తమ బ్యాంకు ఖాతాలను సైబర్ నేరగాళ్లకు ఇవ్వడం ద్వారా “మ్యూల్ అకౌంట్ హోల్డర్లుగా” పనిచేస్తున్నట్లు గుర్తించారు. తమ ఖాతాల ద్వారా జరిగే ప్రతి మోసపూరిత లావాదేవీపై ఐదు శాతం వరకు కమిషన్ తీసుకుంటున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ ఆపరేషన్ సందర్భంగా పోలీసులు 63 మొబైల్ ఫోన్లు, అలాగే 208 బ్యాంకు పాస్బుక్లు, చెక్ బుక్లను స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ సైబర్ మోసాలకు ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అరెస్టైన నిందితులు వివిధ వృత్తులు, సామాజిక వర్గాలకు చెందిన వారిగా గుర్తించారు. వీరిలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, జూబ్లీహిల్స్ మర్చంట్ కోఆపరేటివ్ బ్యాంకులకు చెందిన ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు, ఆరోగ్య రంగానికి చెందిన వ్యక్తులు, విద్యార్థులు, రోజువారీ కూలీలు కూడా ఈ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అరెస్టైన వారి వయస్సు 19 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండటం గమనార్హం.
దర్యాప్తులో మరో కీలక అంశం కూడా బయటపడింది. కొంతమంది మ్యూల్ అకౌంట్ హోల్డర్లు నకిలీ గుర్తింపు పత్రాలు, తప్పుడు కేవైసీ వివరాలు, ఇతరుల మొబైల్ నంబర్లను ఉపయోగించి ఆన్లైన్ లేదా వర్చువల్ బ్యాంకు ఖాతాలను తెరవడం ద్వారా సైబర్ నేరగాళ్లకు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో నేరగాళ్లు తమ గుర్తింపును దాచుకుని పలు ఖాతాల ద్వారా వేగంగా డబ్బును తరలించగలిగినట్లు తేలింది. వరంగల్లో ఒక వ్యక్తి తన కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న బ్యాంకు ఖాతాలను కూడా సైబర్ మోసాల డబ్బు మార్పిడికి ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ కేసుల దర్యాప్తులో భాగంగా మ్యూల్ అకౌంట్ నెట్వర్క్కు సహకరించిన మరో 52 మంది సహాయకులు, మధ్యవర్తులను కూడా పోలీసులు గుర్తించారు. వీరు కొత్త బ్యాంకు ఖాతాలు తెరవడానికి వ్యక్తులను రిక్రూట్ చేయడం, సిమ్ కార్డులు ఏర్పాటు చేయడం, ఏటీఎం కార్డులు, పిన్ నంబర్లు సేకరించడం, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలు అందించడం, మోసపూరిత డబ్బు ఖాతాల్లో జమ అయిన తర్వాత నగదు ఉపసంహరణలు లేదా బదిలీలు చేయడం వంటి పనుల్లో కీలక పాత్ర పోషించినట్లు అధికారులు తెలిపారు.
అత్యంత ముఖ్యంగా, సరైన కేవైసీ ధృవీకరణ ప్రక్రియను పాటించకుండా అక్రమంగా ఖాతాలు తెరవడంలో సహకరించిన అనుమానంతో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులను టీజీసీఎస్బీ హెడ్క్వార్టర్స్ పోలీస్ స్టేషన్ , కొమరం భీం ఆసిఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదేవిధంగా రాష్ట్రంలోని 19 బ్యాంకు శాఖల్లో ఒక్కో శాఖలో 20 కంటే ఎక్కువ మ్యూల్ అకౌంట్లు ఉన్నట్లు గుర్తించడంతో, బ్యాంకింగ్ రంగంలో కేవైసీ విధానాలను మరింత కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు సూచించారు.