Bengaluru: లైంగిక వేధింపులు, కోరిక తీర్చనందుకు 34 ఏళ్ల మహిళను, 18 ఏళ్ల వ్యక్తి హత్య చేశాడు. బెంగళూర్లో వారం రోజుల తర్వాత ఈ హత్యను పోలీసులు ఛేదించారు. జనవరి 3న షర్మిల డీకే తన అద్దె ఇంట్లో మరణించి కనిపించింది. దీనిపై అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. యాక్సెంచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న షర్మిల, రామమూర్తి నగర్లోని సుబ్రమణ్య లేఅవుట్లో ఉన్న తన అపార్ట్మెంట్లో అగ్ని ప్రమాదం జరిగి, ఊపిరాడకుండా మరణించినట్లు అంతా భావించారు.
Read Also: PSLV-C62: పీఎస్ఎల్వీ ప్రయోగం ఎందుకు విఫలమైంది.. అంతరిక్షంలో ఏం జరిగింది?
అయితే, మహిళ మృతిపై విచారణ జరిపిన అధికారులకు విస్తూపోయే విషయాలు తెలిశాయి. శాస్త్రీయ పద్ధతులు, సాంకేతిక ఆధారాలను ఉపయోగించి నిందితుడైన కర్నల్ కురైని అరెస్ట్ చేశారు. ఇతను బాధితురాలి ఇంటి పక్కన ఉన్న ఇంట్లో నివసిస్తున్నాడు. లైంగిక చర్యకు నిరాకరించినందుకు చంపినట్లు తేలింది. విచారణలో కురై నేరాన్ని అంగీకరించినట్లు తెలుస్తోంది.
లైంగిక వేధింపుల కోసం జనవరి 3న రాత్రి 9 గంటల ప్రాంతంలో స్లైడర్ విండో గుండా మహిళ ఇంట్లోకి కురై ప్రవేశించాడు. షర్మిలపై అఘాయిత్యం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, దీనిని ప్రతిఘటించడంతో, ఆమె స్పృహ కోల్పోయే వరకు నోరు, ముక్కును బలవంతంగా మూశాడు. ఈ పెనుగులాటలో షర్మిలకు రక్తస్రావం జరిగింది. సాక్ష్యాలు నాశనం చేసేందుకు నిందితుడు బాధితురాలి బట్టలు, ఇతర వస్తువుల్ని బెడ్రూమ్లో పరుపుపై ఉంచి, నిప్పటించి, అక్కడ నుంచి పారిపోయాడు. పారిపోయే ముందు షర్మిల మొబైల్ ఫోన్ను కూడా దొంగిలించినట్లు తేలింది. నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 103(1) (హత్య), 64(2), 66, మరియు 238 (సాక్ష్యాలను నాశనం చేయడం) కింద కేసు నమోదు చేయబడింది.