Nandyal Tragedy: నంద్యాల జిల్లా ఆత్మకూరులో ఘోరం జరిగింది. అల్లుడు చేసిన ఆర్థిక లావాదేవీల గొడవ.. ఓ నిరుపేద కార్పెంటర్ ప్రాణాలను బలి తీసుకుంది. మైక్రో ఫైనాన్స్ నిర్వాహకుల వేధింపులు, పోలీసుల ఒత్తిడి తట్టుకోలేక రమణ అనే వ్యక్తి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నంద్యాల జిల్లా ఆత్మకూరుకు చెందిన రమణ.. గత కొన్నేళ్లుగా కార్పెంటర్ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయన కుమార్తె కొద్దికాలం క్రితం గంగాధర్ ఆచారి అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకుంది. అయితే, గంగాధర్ ఓ ప్రైవేట్ మైక్రో ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తూ సుమారు 70 లక్షల రూపాయల సంస్థ సొమ్మును వ్యక్తిగత అవసరాలకు వాడుకున్నాడనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఫైనాన్స్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వివాదం మొదలైంది.
READ ALSO: Notice to Haleem Stalls: హలీమ్ స్టాల్స్కు అధికారుల నోటీసులు.. ఉదయం వరకు తొలగించాల్సిందే..!
అల్లుడు గంగాధర్ అప్పు చెల్లించలేక అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు, ఫైనాన్స్ నిర్వాహకులు రమణను లక్ష్యంగా చేసుకున్నారు. “అల్లుడు చేసిన అప్పు నువ్వు కట్టాల్సిందే” అంటూ రమణను పదేపదే స్టేషన్కు పిలిపించి వేధించినట్లు తెలుస్తోంది. బాండ్ పేపర్లు, చెక్కుబుక్కులు ఇవ్వాలంటూ పోలీసులు ఒత్తిడి చేయడంతో రమణ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. మైక్రో ఫైనాన్స్ వేధింపులకు తీవ్ర ఒత్తిడికి లోనైన రమణ.. ఇంట్లోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రమణ కన్నుమూశారు. కేవలం 10 లక్షల రూపాయల వివాదం ఉంటే.. అందులో 5 లక్షలు ఇప్పటికే చెల్లించామని.. అయినా వేధింపులు ఆపలేదని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని, వేధింపులకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని రమణ కుటుంబం డిమాండ్ చేస్తోంది. అప్పు చేసింది.. తప్పు చేసింది అల్లుడు అయితే పోలీసుల వేధింపులు మాత్రం మామకు జరిగాయి. దీంతో ఆ సామాన్యుడు రమణ మృతితో ఆ కుటుంబం వీధిన పడింది.
READ ALSO: Healthy Food: బాలింతలకు వరం.. పసిపాపలకు బలం.. ‘బీరకాయ తెలగపిండి కూర’!