ఉత్తరప్రదేశ్లోని మీరట్లో భార్య ముస్కాన్, ప్రియుడి సాహిల్ చేతిలో అత్యంత ఘోరంగా హత్యకు గురైన మర్చంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్పుత్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను అతి క్రూరంగా హత మార్చిన దుర్మార్గురాలు.. ఏమి ఎరగనట్టుగా.. హతుడి సోదరి చింకికి అతడి మొబైల్ నుంచే హ్యాపీ హోలీ అంటూ ముస్కాన్ వాట్సాప్ చాట్ చేసింది. పాపం.. పుణ్యం ఎరుగని సోదరి.. తన సోదరుడు బతికే ఉన్నాడనుకుని చాటింగ్ చేసింది. కానీ ఆమె.. తన సోదరుడికి ఫోన్ చేస్తే మాత్రం ఎలాంటి రెస్పాన్స్ కనిపించలేదు.
సోదరి చింకికి సౌరబ్ నంబర్ నుంచి వాట్సాప్ సందేశం వచ్చింది. హోలీ కోసం మీరట్లో ఉంటారా అని ముస్కాన్ అడిగింది. చింకి అవును అని సమాధానం ఇచ్చింది. సౌరబ్ లేడని, హోలీ తర్వాతే తిరిగి వస్తాడని మరొక సందేశం పంపింది. మరుసటి రోజు చింకి ఫోన్ కాల్స్కు స్పందించకపోవడంతో సౌరభ్ రాజ్పుత్ కుటుంబానికి అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించారు. ఈ విధంగా ఘోరం వెలుగులోకి వచ్చింది.
సౌరభ్ రాజ్పుత్(29) ముస్కాన్ (27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. సౌరబ్ మర్చంట్ నేవీలో పని చేసేవాడు. ఇక 2019లో వీరికి ఒక పాప పుట్టింది. అయితే భార్య పోరు భరించలేక.. సౌరబ్ తన తల్లిదండ్రుల నుంచి విడిపోయి వేరే కాపురం పెట్టాడు. ఇక సౌరభ్ కూడా ఉద్యోగం మానేసి లండన్ వెళ్లిపోయాడు. ఈ మధ్యలో సాహిల్(25) అనే యువకుడితో ముస్కాన్ వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇక ఇద్దరూ కూడా డ్రగ్స్కు బానిసలైపోయారు. అయితే విషయం తెలిసి సౌరబ్ విడాకులు ఇచ్చేయాలని అనుకున్నాడు. కానీ కుమార్తె కోసం వెనక్కి తగ్గాడు. అయితే ముస్కాన్ మాత్రం.. తన భర్త సౌరబ్ను అడ్డు తొలగించుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఇందుకోసం అదునుచూసింది. అయితే సౌరబ్.. తన కుమార్తె పుట్టిన రోజు కోసం ఫిబ్రవరిలో భారత్కు వచ్చాడు. అప్పటి నుంచి భర్తను చంపేందుకు ముస్కాన్ శతవిధాలా ప్రయత్నం చేసింది. కానీ సక్సెస్ కాలేదు. చివరికి మార్చి 4న ప్రియుడ్ని ఉసిగొల్పి హత్యకు ప్లాన్ చేసింది. అంతే భర్తకు మత్తు మందు ఇచ్చి మర్డర్ చేశారు. అనంతరం మృతదేహాన్ని 15 ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో దాచి పెట్టి సిమెంట్తో కప్పేశారు.
అయితే సౌరబ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకోగా… బండారం బయటపడింది. తామే చంపినట్లుగా నేరాన్ని అంగీకరించారు. మొత్తానికి 15 రోజుల తర్వాత హత్య ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఇదిలా ఉంటే తమ కుమార్తెకు ఉరిశిక్ష విధించాలని నిందితురాలు ముస్కాన్ తల్లిదండ్రులు కోరారు. తమ కుమార్తెనే సౌరబ్ కుటుంబాన్ని నాశనం చేసిందని.. బంగారం లాంటి కుటుంబాన్ని విడదీసిందని మండిపడ్డారు. డ్రగ్స్కు బానిసై ఇంతటి నీచానికి ఒడిగట్టిందని దుమ్మెత్తిపోశారు.