IDFC First Bank scam: ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనతో బ్యాంక్ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలి పోయాయి. ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్లో రూ. 590 కోట్ల మేర ఫ్రాడ్ బయటపడింది. ఈ మోసం హర్యానా ప్రభుత్వం సంబంధిత ఖాతాలతో కలిసినట్టు బ్యాంక్ తెలియజేసింది. దీంతో ఇవాళ (ఫిబ్రవరి 23న) ట్రేడింగ్ ప్రారంభం కాగానే ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ షేర్ ధర 20 శాతం వరకు పడిపోయి ఒక్కో షేర్ రూ. 66.85కి చేరుకుంది. నిన్న ముగింపు ధర రూ. 83.57 కాగా, ఈ రోజు షేర్ రూ. 75.21 దగ్గర ప్రారంభమైంది. అంటే ఓపెనింగ్ నుంచే దాదాపు 10 శాతం నష్టంతో ట్రేడింగ్ స్టార్ట్ అయింది.
Read Also: The Paradise : నాని ‘ప్యారడైజ్’ ఫస్ట్ లిరికల్ ‘ఆయా షేర్’ ప్రోమో రిలీజ్
ఈ స్కామ్ గుర్తించిన వెంటనే హర్యానా ప్రభుత్వం ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తో పాటు ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ను ప్రభుత్వ పనుల ప్యానెల్ లిస్ట్ నుంచి తొలగించింది. ఇకపై ప్రభుత్వ లావాదేవీల కోసం ఈ బ్యాంకులను ఉపయోగించమని తేల్చి చెప్పింది. బ్యాంక్ రిలీజ్ చేసిన ప్రకటనలో నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు పేర్కొనింది. అలాగే స్వతంత్ర సంస్థ ద్వారా ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. బ్యాంక్ ఫైలింగ్ ప్రకారం, హర్యానా సర్కార్ లోని ఒక విభాగం నుంచి వచ్చిన సమాచారంతో మొదట అంతర్గత విచారణ చేపట్టగా.. ఆ సమయంలో చండీగఢ్ బ్రాంచ్లో కొందరు ఉద్యోగులు మోసపూరితంగా వ్యవహరించినట్టు తేలింది. ఈ వ్యవహారంలో ఇతర వ్యక్తులు లేదా సంస్థలు కూడా ఉండే ఛాన్స్ ఉందని ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తెలిపింది.