హైదరాబాద్లో ఘరానా మోసగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒకరు కాదు..ఇద్దరు కాదు..ఏకంగా రెండు వందల మంది అమ్మాయిలను బుట్టలో వేసుకున్నాడు. న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరించాడు. కొంతమందిని లొంగదీసుకొని లైంగికదాడికి పాల్పడ్డాడు. ఐతే…ఎవరూ ఫిర్యాదు చేయకపోవటంతో ఈ వ్యవహారం కొంతకాలం పాటు సాగిపోయింది. ఓ బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించటంతో ఈ బండారం బట్టబయలైంది.
హైదరాబాద్లో కామాంధుడిని అరెస్ట్ చేసి..రిమాండ్కు తరలించారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇన్స్టాగ్రామ్ ద్వారా దాదాపు 200 మంది అమ్మాయిలను మోసం చేశాడు. వరంగల్ జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్ధి అజయ్..ఇన్స్టాగ్రామ్లో అమ్మాయి పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. అమ్మాయిలతో పరిచయం పెంచుకున్నాడు. వారితో ఛాట్ చేసి న్యూడ్ ఫోటోలను కలెక్ట్ చేశాడు. ఆ ఫోటోలను అడ్డం పెట్టుకుని అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేశాడు. ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో అజయ్ వ్యవహారం బట్టబయలైంది.
ఇక…ఈ నరరూప రాక్షసుడిని విచారించిన పోలీసులు దిమ్మదిరిగే నిజాలు రాబట్టారు. తనను తాను అమ్మాయిగా ఫేక్ అకౌంట్తో పరిచయం చేసుకుంటాడు. న్యూడ్ ఫొటోలు పంపించకపోతే మార్ఫింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని బెదిరింపులకు పాల్పడతాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా పెద్ద ఎత్తున అమ్మాయిలను వేధించినట్లు పోలీసు విచారణలో తేలింది.
మరోవైపు..15 రోజుల క్రితం ఓ అమ్మాయి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు..దిల్సుఖ్నగర్లో నిందితుడిని అరెస్ట్ చేశారు. నిందితుడు వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్గా గుర్తించారు. మల్టీమీడియా చదువుకుంటూ, నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ అమ్మాయిలను టార్గెట్ చేసినట్లు వెల్లడించారు. ఈ కేసులో మరింత మంది బాధితులు ఫిర్యాదు చేసే అవకాశం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు భావిస్తున్నారు.