Husband Suicide: భార్య, ఆమె కుటుంబం వేధింపుల వల్ల తనువు చాలిస్తున్న భర్తల కేసులు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్కు చెందిన ఒక యువ ఇంజనీర్ భార్య వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నారు. గురువారం కుషినగర్లో ఒక చెట్టుకు ఉరి వేసుకుని మరణించారు. మరణానికి ముందు ఒక వీడియోలో తన చావుకు భార్యనే కారణమని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
వెల్వా పాలక్ధారి గ్రామానికి చెందిన 33 ఏళ్ల ప్రద్యుమ్న కుమార్ యాదవ్, మధ్యప్రదేశ్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఇంజనీర్గా పని చేస్తున్నాడు. మరణించడానికి ముందు భార్యపై తీవ్ర ఆరోపణలు చేశారు. ‘‘ నేను చనిపోయే సమయం ఇది కాదు. కానీ నా భార్య హింసను భరిస్తూ బతకడం నాకు ఇష్టం లేదు. నేను అకాల మరణం చెందానని ఎవరూ అనుకోకూడదు. అన్నయ్యా దయచేసి తల్లిదండ్రులకు కొడుకు లేడనే భావన కలుగనివ్వకు. ప్రతీ తల్లిదండ్రులు తమ వృద్ధాప్యంలో అండగా ఉండే కొడుకును ఆశిస్తారు. కానీ నా భార్య పెడుతున్న బాధల ముందు నేను వారి దు:ఖాన్ని మరిచిపోయాను. ఇప్పుడు నాకున్న ఏకైక మార్గం ఇదే. నేను జీవితంపై ఆశ కోల్పోయాను. దీనికి కారణం మరెవరో కాదు, నేను కొత్త జీవితం ప్రారంభించినప్పుడు నా చేయి పట్టుకున్న నా భార్యే. ఆమె వరకట్నం వేధింపుల కేసు పెట్టింది, దాంతో నేను కుంగిపోయాను. ఆ కుంగుబాటుకు ఎంతగా కుంగిపోయానంటే, నా జీవితాన్ని ముగించుకున్నాను’’ అని వీడియో మెసేజ్లో చెప్పారు.
2017లో కుషినగర్ సమీపంలోని సోహగ్ గ్రామానికి చెందిన అర్పిత యాదవ్ను పెళ్లి చేసుకున్నాడు. వివాహం తర్వాత ప్రద్యుమన్తో కలిసి హర్యానాలో నివసించింది. 2020లో ఇద్దరి మధ్య వివాదాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అర్పితా ప్రద్యుమన్పై వరకట్న వేధింపులు కేసు పెట్టింది. అప్పటి నుంచి అర్పిత తన 5 ఏళ్ల కుమార్తెతో కలిసి తల్లితో ఉంటోంది. కోర్టు కేసులు ప్రద్యుమన్ను మానసిక క్షోభకు గురిచేసింది. ఈ నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు చెబుతున్నారు.
