Advocate Swapna Murder: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లి గ్రామంలో సంచలన హత్య జరిగింది. ఆస్తి వివాదమే కారణంగా అడ్వకేట్ స్వప్నను ఆమె సోదరుడు రాజు దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనలో రాజుతో పాటు మరో ముగ్గురు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Gaddar Awards: ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అడ్వకేట్ స్వప్నకు, ఆమె సోదరుడు రాజుకు మధ్య గత కొద్ది రోజులుగా భూ వివాదం నడుస్తోంది. తల్లి తమ 10 ఎకరాల పొలాన్ని ఇద్దరి మధ్య పంచగా.. అందులో 6 ఎకరాలు రాజుకు, 4 ఎకరాలు స్వప్నకు రాసి ఇచ్చింది. అయితే స్వప్నకు నాలుగు ఎకరాలు రావడం రాజుకు ఇష్టం లేకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజుపై స్వప్న ఇప్పటికే రెండు సివిల్ కేసులు కూడా వేసింది. అవి ప్రస్తుతం కోర్టులో నడుస్తున్నాయి.
శనివారం ఉదయం స్వప్న తనకు కేటాయించిన నాలుగు ఎకరాల భూమిలో సర్వే పనులు చేయించేందుకు వెళ్లింది. అదే భూమిలో ఒక ఎకరం అమ్మేందుకు ఆమె అగ్రిమెంట్ చేసిన విషయం రాజుకు తెలిసింది. దీంతో అక్కడే మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. ఆ సమయంలో రాజు కత్తితో స్వప్నపై దాడి చేసి, బండరాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ నేరానికి రాజుతో పాటు మరో ముగ్గురు సహకరించారు.
ఈ ఘటనపై NTVతో మాట్లాడిన చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతం మాట్లాడుతూ.. ఆస్తి వివాదమే హత్యకు కారణమని తెలిపారు. రాజు, అతడి డ్రైవర్ గణేష్ సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు. కేసు దర్యాప్తు కోసం నాలుగు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశామని, పరారీలో ఉన్న మరో నిందితుడిని త్వరలో పట్టుకుంటామని.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. అడ్వకేట్ స్వప్నకు వివాహం కాలేదని.. అన్ని కోణాల్లో ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుటుంబ ఆస్తి వివాదం చివరకు ప్రాణాలు తీసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనపై నా కూతురును హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతురాలి తల్లి వెంకటమ్మ అన్నారు. స్వప్న అన్న రాజు దారుణానికి వడిగట్టాడని.. గత మూడేళ్లుగా స్వప్నని చంపాలని రాజు పథకం పన్నాడని ఆమె అన్నారు. ఇప్పటికే రెండుసార్లు చంపేందుకు ప్రయత్నించాడని, భూమి సర్వే చేసిన తర్వాత తిరిగి వెళుతుండగా రాజు మరో ముగ్గురు వ్యక్తులు నా కూతురుపై దాడి చేశారని ఆమె పేర్కొన్నారు. కర్రలతో, కత్తులతో దాడి చేసి దారుణంగా హత్యకి పాల్పడ్డారని.. రాజుని కఠినంగా శిక్షించాలని ఆమె అన్నారు.