Gaddar Awards: తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాదును కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం సెక్రటేరియట్లో గద్దర్ సినిమా అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాంబే, కలకత్తా, చెన్నై వంటి పట్టణాల్లో సినీ ఇండస్ట్రీ పెరగడానికి అంతగా అవకాశాలు లేవు, కానీ దేశంలో ఉన్న అన్ని భాషల ఇండస్ట్రీలను హైదరాబాద్లో విస్తరించడానికి సానుకూల అంశాలు అనేకం ఉన్నాయని తెలిపారు. సకల భాషల సినీ ఇండస్ట్రీ, హైదరాబాద్కు తరలి వస్తే రాష్ట్ర యువతకు, టెక్నీషియన్లు, రైటర్లు, డైరెక్టర్లకు ఉపాధి లభిస్తుంది. సినీ ప్రపంచ మార్కెట్కు హైదరాబాద్ కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ప్రభుత్వం తయారు చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు సినిమా రంగానికి సంబంధించిన అవార్డుల విషయంలో నిర్లక్ష్యం వహించి వదిలేస్తే, సమాజంలో అత్యంత ప్రభావం చూపే సామాజిక పరివర్తన తీసుకొచ్చే సినీ రంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అవార్డులు ఇచ్చి తిరిగి ప్రోత్సహించడం ప్రారంభించిందని వివరించారు.
READ ALSO: DSLR లాంటి ఫోటోగ్రఫీ ఇచ్చే టాప్ 200MP Camera స్మార్ట్ఫోన్లు ఇవే!
సమాజం కోసం కళల ద్వారా తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానుభావుడు గద్దర్ అని డిప్యూటీ సీఎం కొనియాడారు. తెలంగాణ అంటే కళలు, విప్లవం, ప్రశ్నించడం, సున్నిత మనసుతో, ప్రేమానురాగాలతో కూడినదని, తెలంగాణ కళలు, సంస్కృతిని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి గద్దర్ అని పేర్కొన్నారు. అందుకే వారి పేరు మీద గత సంవత్సరం నుంచి సినిమా అవార్డులు ఇవ్వడం ప్రారంభించి, సినీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రతిభ, పారదర్శకతలే ప్రమాణంగా సినిమా అవార్డుల ఎంపిక ఉంటుందని, గత సంవత్సరం జ్యూరీ సభ్యులు అవార్డుల ఎంపికను గొప్పగా నిర్వహించి, అభినందనలు పొందిన విషయాన్ని డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. సినీ రంగ ప్రముఖులకు ఉన్న అనుభవాన్ని, నిబద్ధతను, సినిమా రంగం పట్ల వారికున్న అభిమానాన్ని దృష్టిలో పెట్టుకొని ఎఫ్ డి సి ద్వారా అందరితో సంప్రదింపులు జరిపి జ్యూరీ సభ్యులను ఎంపిక చేశారని, ప్రభుత్వ నుంచి కావలసిన సహకారాన్ని పూర్తిస్థాయిలో అందజేస్తామని తెలిపారు. ప్రతి పని సమాజానికి ఉపయోగపడాలి, ప్రజలకు జవాబు దారిగా ఉండాలన్న లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. గద్దర్ అవార్డుకు ఎంపిక చేసే సినిమాలో కమర్షియల్ అంశంతో పాటు సామాజిక సందేశం తప్పనిసరిగా ఉండేలా జాగ్రత్త తీసుకుంటే రాబోయే రోజుల్లో సమాజంలో మంచి సినిమాలను ప్రోత్సహించేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. ఈనెల 6 నుంచి గద్దర్ సినిమా అవార్డుల స్క్రీనింగ్ కార్యక్రమం ప్రారంభమవుతుందని, 19న ఉగాది పండుగ రోజు గద్దర్ అవార్డుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పారు. ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
READ ALSO: Varanasi: పృథ్వీరాజ్ సుకుమారన్కు చుక్కలు చూపించిన జక్కన్న.. ఒక షాట్ కోసం 94 టేక్లు!