రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు కోసం కొత్త కస్టమర్లను చేర్చుకోరాదని ఆర్బీఐ ఆదేశించింది. అంతేకాకుండా కంపెనీ ఐటీ సిస్టమ్ను సమగ్రంగా ఆడిట్ చేసేందుకు ఐటీ ఆడిట్ కంపెనీని నియమించుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఐటీ ఆడిటర్ల నివేదిక వచ్చే వరకు కొత్త కస్టమర్లను తీసుకోవద్దని స్పష్టం చేసింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం 1949లోని సెక్షన్ 35ఏ ప్రకారం ఆడిటింగ్కు ఆదేశించామని స్పష్టం చేసింది. ఒకవేళ ఆన్బోర్డు చేయాలంటే ఆర్బీఐ ప్రత్యేక అనుమతి తీసుకోవాలని సూచించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో గమనించిన కొన్ని మెటీరియల్ సూపర్వైజరీ సమస్యల కారణంగా ఈ చర్య తీసుకున్నట్టు ఆర్బీఐ తెలిపింది.
కాగా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తన కార్యకలాపాలను మే 23, 2017న ప్రారంభించింది. ప్రస్తుతం కంపెనీకి 100 మిలియన్ల కస్లమర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతి నెల పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో 0.4 మిలియన్ల వినియోగదారులు చేరుతున్నారు. పేటీఎం పేమెంట్ బ్యాంక్ లిమిటెడ్ రెండు నెలల క్రితమే రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి షెడ్యూల్ బ్యాంక్ హోదా అందుకుంది. ఫలితంగా ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు, నగదు బదిలీ, రెపో రేట్, రివర్స్ రెపోరేటు, వడ్డీరేట్ల మార్పులు చేసేందుకు వీలుంటుంది. బహుశా ఒక డిజిటల్ బ్యాంకుకు షెడ్యూలు హోదా రావడం ఇదే తొలిసారి.
