Sanjay Malhotra: పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక

  • పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం తీవ్రం
  • అంతర్జాతీయంగా మరో సంక్షోభం తలెత్తే సూచనలు
  • యుద్ధం నేపథ్యంలో దేశానికి ఆర్బీఐ గవర్నర్ హెచ్చరిక
Rbigove

Rbigove

పశ్చిమాసియాలో మరోసారి యుద్ధం తీవ్రం కావడంతో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా హెచ్చరికలు జారీ చేశారు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం స్థిరంగా ఉన్నప్పటికీ.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు దేశానికి సవాళ్లుగా మారే అవకాశం ఉందని సంజయ్ మల్హోత్రా వార్నింగ్ ఇచ్చారు. గురువారం ద్రవ్యోల్బణం, రూపాయి మారకపు విలువపై స్పందించిన ఆయన.. ప్రస్తుతం ద్రవ్యోల్బణం, రూపాయి రెండూ సాపేక్షంగా అనుకూల స్థితిలోనే ఉన్నాయని తెలిపారు. అయితే పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఘర్షణల ప్రభావాన్ని నిర్లక్ష్యం చేయలేమని అన్నారు.

ద్రవ్యోల్బణంపై మాట్లాడుతూ.. సరఫరా వ్యవస్థపై ఒత్తిళ్ల కారణంగా ద్రవ్యోల్బణం లక్ష్యాన్ని మించే అవకాశం ఉందని.. అయినప్పటికీ ప్రస్తుతం ద్రవ్యోల్బణ పరిస్థితి సాపేక్షంగా మంచి స్థితిలోనే ఉందని అభిప్రాయపడ్డారు. రూపాయి మారకపు విలువపై స్పందిస్తూ.. భారత కరెన్సీ కూడా ప్రస్తుతం స్థిరమైన స్థితిలో కొనసాగుతోందని తెలిపారు. అయితే పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం, దానికి సంబంధించిన అనిశ్చితులు భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశముందని హెచ్చరించారు. అంతర్జాతీయ పరిణామాలను ఆర్బీఐ నిరంతరం పర్యవేక్షిస్తోందని, అవసరమైన సమయంలో తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉందని గవర్నర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ బలమైన పునాదులపై నిలిచి ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ పరిణామాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని గవర్నర్ సూచించారు.

ప్రస్తుతం మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య భీకర దాడులు జరుగుతున్నాయి. తాత్కాలిక శాంతి ఒప్పందం ముగియడంతో మళ్లీ దాడులు తీవ్రమయ్యాయి. పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా మరోసారి తీవ్ర సంక్షోభం నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.