Home Loans: రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) హోమ్ లోన్ వినియోగదారులకు గుడ్న్యూస్ చెప్పింది. వారి హోమ్లోన్ ఫిక్స్డ్ వడ్డీ రేట్లను మార్చుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఉన్న ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్డ్ వడ్డీ రేట్ల విధానానికి మారే అవకాశం కల్పించింది. ఇందుకు సంబంధించి ఓ ఫ్రేమ్వర్క్ను తీసుకొస్తామని ఆర్బీఐ ప్రకటించింది. ఇది కేవలం హోమ్లోన్ కస్టమర్లే కాకుండా వాహన, ఇతర రుణాలు తీసుకున్న వారూ ఈ విధానం కింద అధిక వడ్డీ రేట్ల నుంచి ఉపశమనం పొందే వీలుంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Read also: No Confidence Motion: కాంగ్రెస్పై భారత్కు అవిశ్వాసం ఉంది.. ప్రధాని మోడీ ఫైర్
మూడు రోజులపాటు పరపతి విధాన కమిటీ(ఎంపీసీ) సమావేశాలు జరిగిన అనంతరం ఆర్బీఐ గవర్నర్ గురువారం మీడియాతో మాట్లాడారు. సాధారణంగా వడ్డీ రేట్ల పెరిగినప్పుడు రెగ్యులేటెడ్ బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఈఎంఐలో ఎలాంటి మార్పులూ చేయకుండా కాలవ్యవధిని సవరిస్తుంటాయి. ఈ విషయంలో రుణ గ్రహీతకు ఎలాంటి సమాచారం ఇవ్వవు. పెద్ద సంఖ్యలో ప్రజలు ఇదే విషయాన్ని తాము చేపట్టిన అభిప్రాయ సేకరణలో వెల్లడించారని చెప్పారు. ఫ్లోటింగ్ వడ్డీ విధానంలో బ్యాంకులు తమ వద్ద నుంచి ఎలాంటి సమ్మతి లేకుండానే నిర్ణయం తీసుకుంటున్నాయని వారు తమ దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇందుకు పరిష్కారంగా ఆయా ఆర్థిక సంస్థలు అమలు చేసే విధంగా ఓ ఫ్రేమ్వర్క్ను తీసుకురాబోతున్నట్లు శక్తికాంత దాస్ తెలిపారు. కొత్త ఫ్రేమ్ వర్క్ ప్రకారం రుణ కాలాన్ని, ఈఎంఐలో మార్పులు చేసేటప్పుడు సంబంధిత సమాచారాన్ని రుణ గ్రహీతలకు తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే ఫ్లోటింగ్ వడ్డీ రేట్ల విధానం నుంచి ఫిక్స్డ్ విధానానికి మారేందుకు అవకాశం ఇవ్వడం లేదా ముందస్తు చెల్లింపులకు రుణ గ్రహీతకు అనుమతించాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ఆప్షన్ల అమలుకు సంబంధించి వివిధ ఛార్జీల విషయంలో పారదర్శకంగా వ్యవహరించడంతో పాటు రుణ గ్రహీతకు ఆయా ఛార్జీల వివరాలను స్పష్టంగా తెలియజేయాల్సి ఉంటుందని శక్తికాంత దాస్ చెప్పారు.